Chittoor: కుప్పం వెళ్తూ ప్రమాదానికి: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
Recommended Video
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. సుమారు 30 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారంతా తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారంతా అయ్యప్ప స్వామి భక్తులు. శబరిమల నుంచి స్వస్థలానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
జిల్లాలోని చంద్రగిరి మండలం కాశింపెట్ల సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ అమరావతి వోల్వో బస్సు విజయవాడ నుంచి కుప్పానికి బయలుదేరింది. మార్గమధ్యలో కాశింపేట వద్ద అయ్యప్ప స్వామి భక్తులతో కూడిన ప్రైవేటు వోల్వో బస్సును ఎదురుగా అతి వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ అమరావతి బస్సు డ్రైవర్ రమేష్, మరో ప్రయాణికుడు దుర్మరణం పాలయ్యారు. ప్రమాద తీవ్రతకు రెండు బస్సుల ముందు భాగాలు కూడా నుజ్జునుజ్జయిపోయాయి.
ప్రైవేటు వోల్వో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. రెండు బస్సుల్లో సుమారు 50 మందికి పైగా ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని తిరుపతిలోని రూయా ఆసుపత్రికి తరలించారు. అయ్యప్పస్వామి భక్తులకు ప్రత్యామ్నాయ రవాణా వసతిని కల్పించారు. చికిత్స పూర్తయిన అనంతరం వారిని నల్లగొండకు పంపిస్తామని స్థానిక పోలీసులు వెల్లడించారు.
Chittoor: కుప్పం వెళ్తూ ప్రమాదానికి: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం #Chittoor #Chandragiri #APSRTCBus #Putalapattu #Naidupet pic.twitter.com/pkBniMCpdF
— Oneindia Telugu (@oneindiatelugu) January 8, 2020