వ్యాక్సిన్ వికటించి పారిశుధ్య కార్మికుడు మృతి..టీకా వల్లే అన్న బాధిత కుటుంబం: చిత్తూరు జిల్లాలో ఘటన
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. జనవరి 16 నుండి ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ముందుగా ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా వ్యాక్సిన్ లను ఇస్తున్నారు. అయితే అడపాదడపా వస్తున్న ప్రతికూల ఫలితాలను మినహాయించి, ఎక్కువ శాతం సానుకూల ఫలితాలు వస్తున్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ నివేదిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన 28 సంవత్సరాల పిల్ల లలిత అనే గ్రామ మహిళా వాలంటీర్ మృతిచెందగా, తాజాగా మరో పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందాడు.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే మరణించిన పారిశుధ్య కార్మికుడు
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజు చిత్తూరు జిల్లాలో పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందడం వారి కుటుంబంలో విషాదం నింపింది. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం తిరుపతి రూరల్ మండలం, మల్లగుంట పంచాయతీ అంబేద్కర్ కాలనీకి చెందిన పారిశుధ్య కార్మికుడు 51 సంవత్సరాల వయసున్న ఆర్ కృష్ణయ్య గొల్లపల్లి పంచాయతీలో పనిచేస్తున్నారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో కృష్ణయ్య వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కృష్ణయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
కృష్ణయ్యకు డయాబెటిస్, బీపీ ఉన్నా వ్యాక్సిన్ ఇచ్చారన్న కుటుంబసభ్యులు
కృష్ణయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కుటుంబ సభ్యులు రుయా ఆసుపత్రికి తరలిస్తుండగా కృష్ణయ్య ప్రాణాలు విడిచాడు. కృష్ణయ్యకు డయాబెటిస్, హైపర్ టెన్షన్, పక్షవాతం వంటి సమస్యలు ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే తన తండ్రికి డయాబెటిస్, హైబీపీతో పాటుగా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వ్యాక్సిన్ ఇవ్వడం వల్లే తండ్రి మరణించాడని మృతుని కుమారుడు తిరుమల ఆరోపిస్తున్నారు.
పోస్ట్ మార్టం నివేదిక వచ్చాకే మృతి కారణం చెప్తామన్న జిల్లా వైద్య ఆరోగ్య అధికారి
దీనిపై స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పెంచలయ్య కృష్ణయ్య టీకా తీసుకున్నది వాస్తవమే కానీ కృష్ణయ్య మృతికి గల కారణాలు పోస్టుమార్టం రిపోర్టు తర్వాతనే వస్తాయని చెప్పారు. ఇక ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని ఆయన వివరించారు . ఇక ఇటీవల శ్రీకాకుళం జిల్లా పలాస రెంటికోట కు చెందిన పిల్ల లలిత అనే గ్రామ వాలంటీర్ మృతిచెందగా ప్రభుత్వ 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఇప్పుడు తాజాగా మరో పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది.