ఒక్క ఫోన్ కాల్: ఏపీ-తమిళనాడు సరిహద్దుల్లో కట్టిన గోడ కూల్చివేత: నిర్మించిన మరుసటి రోజే..
చిత్తూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాల మధ్య రాకపోకలను స్తంభింపజేయడానికి కంచెలను అడ్డుగా పెట్టుకున్న తరహాలోనే ఏపీ-తమిళనాడు మధ్య నడిరోడ్డు మీద కట్టిన గోడ కూలిపోయింది. తాత్కాలికంగా కట్టిన ఈ గోడను తమిళనాడులోని వేలూరు జిల్లా అధికారులు తొలగించారు. కట్టిన 36 గంటల్లోనే దాన్ని ధ్వంసం చేసి పడేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఙప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వేలూరు జిల్లా కలెక్టర్ షణ్ముగ సుందరం తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. సరిహద్దు గ్రామాల ప్రజలు తరచూ అటూఇటూ రాకపోకలు సాగిస్తున్నారు. చిత్తూరు జిల్లా నుంచి తమిళనాడులోని వేలూరు జిల్లా మధ్య సరిహద్దు గ్రామాల ప్రజలు యథేచ్ఛగా ద్విచక్ర వాహనాల మీద తిరుగాడుతుండటాన్ని అడ్డుకోవడంలో భాగంగా.. చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో తమిళనాడు భూభాగంలోని పొన్నై చెక్పోస్ట్ సమీపంలో నాలుగు అడుగుల ఎత్తులో గోడను కట్టారు స్థానిక అధికారులు.
ఈ గోడ నిర్మాణం తాత్కాలికమే. లాక్డౌన్ను ఎత్తేసిన తరువాత గోడను కూాడా తొలగిస్తామని అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ.. అది కాస్తా ఏపీలో కలకలానికి దారితీసింది. చిత్తూరు జిల్లా సహా రాయలసీమలోని అనేక గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురైతే పొరుగునే ఉన్న వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (సీఎంసీ) ఆసుపత్రికి వెళ్తుంటారు. దారి మధ్యలో కట్టిన గోడ వల్ల అత్యవసర సేవలను స్తంభింపజేసినట్టవుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనిపై చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా.. వేలూరు కలెక్టర్ షణ్ముగ సుందరంతో ఫోన్లో మాట్లాడినట్లు చెబుతున్నారు.
గోడను తొలగించాలని కోరినట్లు తెలుస్తోంది. దాన్ని నిర్మించడం వల్ల వచ్చే ఇబ్బందుల గురించి వివరించారని, దేశంలో మరెక్కడా ఇలాంటి సందర్భం చోటు చేసుకోలేదనే విషయాన్ని వెల్లడించారని అంటున్నారు. కరోనా వైరస్ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల సరిహద్దుల మధ్య ఇలా గోడలను నిర్మించలేదనే విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీనితో ఆ గోడను కూల్చివేయడానికి షణ్ముగ సుందరం అంగీకరించారు. కట్టిన 36 గంటల్లోనే జేసీబీలను పంపించి, వాటిని పడగొట్టారు.