నగరిలో చిచ్చు.. రోజా ఆరోపణలు,కేసులపై సీఎం జగన్ రియాక్షన్ ఏంటి..?
ఎమ్మెల్యే రోజాకు నగరి నియోజకవర్గంలో తొలిసారి చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గంలోని కేబీఆర్ పురలో గ్రామ సచివాలయ భూమి పూజ కోసం వెళ్లిన ఆమెపై వైసీపీ కార్యకర్తలే తిరగబడ్డారు. ఆమె కారును అడ్డుకుని వాహనంపై దాడి చేసినంత పనిచేశారు. మరో వర్గం వారిని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. రెండోసారి గెలిచాక రోజా తమను పట్టించుకున్న పాపాన పోలేదంటూ ఆమెపై విమర్శలు గుప్పించారు. దీంతో రోజా కారు దిగకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతేకాదు సొంత పార్టీ నేతల పైనే కేసులు పెట్టి సంచలన ఆరోపణలు చేశారు. పరోక్షంగా మంత్రి పెద్దిరెడ్డిపై కూడా ఆరోపణలు చేశారు. ఇలా సొంత పార్టీ నేతల పైనే రోజా ఆరోపణలు చేయడం,కేసులు పెట్టడంపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సొంత పార్టీ కార్యకర్తలపై కేసు పెట్టిన నగరి ఎమ్మెల్యే రోజా .. ఎందుకంటే
రోజా ఏమన్నారు :
గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గానికి చెందిన కొంతమంది వైసీపీ నేతలు, జిల్లాకు చెందిన పెద్ద నాయకుల సహకారంతో తనకు వ్యతిరేకంగా పనిచేశారని రోజా ఆరోపించారు. ఇప్పుడు వైసీపీ ముసుగులో తనపై దాడికి యత్నించారని ఆరోపించారు. ఎన్నికల్లో తనను ఓడించాలని కుట్ర చేసినప్పటికీ.. తానే గెలిచానని, తన గెలుపును జీర్ణించుకోలేకనే తనపై మళ్లీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
ఏదైనా ఉంటే ఇంటికొచ్చి చెప్పాలని.. :
గ్రామ సచివాలయ ఏర్పాటు విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే నగరిలోని తన నివాసానికి వచ్చి వినతిపత్రం ఇచ్చి ఉండాల్సిందని రోజా అన్నారు. అంతే తప్ప దాడికి పాల్పడాలనుకోవడం సరికాదన్నారు. ఇదివరకు తనను ఓడించాలని కుట్రచేసినవారు కాబట్టే.. ఇప్పుడిలా దాడులకు యత్నిస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలు ఎవరైనా సరే నేరుగా తన ఇంటికి వచ్చి పనులు చేయించుకోవాలన్నారు. తప్పులు చేసినవారిపై పార్టీ చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్టు చెప్పారు.
అసలేంటీ చిచ్చు :
నగరి నియోజకవర్గానికి అమ్ములు వర్గం రోజా తీరును వ్యతిరేకిస్తోంది. టీడీపీ నుంచి వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తూ తమను పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఏ పని గురించి సంప్రదించినా.. చూద్దాం,చేద్దాం అనడమే తప్పించి పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేబీఆర్ పుర గ్రామ సచివాలయ భూమి పూజకు వచ్చిన రోజాను అమ్ములు వర్గం అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట,తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు రోజా అక్కడి నుంచి వెనుదిరగక తప్పలేదు. ఆపై పుత్తూరు పోలీస్ స్టేషన్కు వెళ్లి తనపై దాడి జరిగిందని పోలీస్ స్టేషన్లో 10 మందిపై ఫిర్యాదు చేసింది. రోజా ఫిర్యాదు మేరకు కేసులు వైసీపీ కార్యకర్తలపై సెక్షన్ 143,427,341 506 509ల కింద కేసులు నమోదు చేశారు.
జగన్ ఎలా స్పందిస్తారు..
సొంత పార్టీ నేతల పైనే రోజా పోలీస్ కేసులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. వారితో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిందిపోయి పోలీసుల దాకా వెళ్లడమేంటని వైసీపీ నేతలే అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. కార్యకర్తలతో సఖ్యత కోల్పోతే భవిష్యత్లో కష్టాలు తప్పవని అంటున్నారు. మరోవైపు సీఎం జగన్ ఈ ఘటనపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నగరి కార్యకర్తలను ఆయన మందలిస్తారా.. లేక వ్యవహార శైలి మార్చుకోవాలని రోజానే సున్నితంగా హెచ్చరిస్తారా అన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు, తన ఓటమికి జిల్లా పెద్ద నేతలు కుట్ర చేశారంటూ మంత్రి పెద్దిరెడ్డిని పరోక్షంగా టార్గెట్ చేయడంపై కూడా జగన్ రోజాతో మాట్లాడే అవకాశం ఉందంటున్నారు. ఇలా ఒకే పార్టీకి చెందిన నేతలు ఆరోపణలు చేసుకుంటే జనంలో పార్టీ చులకనయ్యే అవకాశం ఉండటంతో.. మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా జగన్ వైపు నుంచి ఆదేశాలు వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఒకే పార్టీలో ఉంటూ రోడ్డున పడి రచ్చ చేసుకోవడం పార్టీ ఇమేజ్ను దెబ్బతీస్తుందని వైసీసీలో అంతర్గత చర్చ జరుగుతున్నట్టు సమాచారం.