ఇదేమీ విచిత్రం: కాన్పు కోసం వచ్చిన మహిళ.. గర్భవతి కాదంటోన్న వైద్యులు
కలికాలమో.. ఆధునిక పోకడలో తెలియడం లేదు. చిత్ర, విచిత్ర ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా తిరుపతిలో ఇలాంటి ఘటన జరిగింది. ఓ మహిళ.. తాను గర్భవతి నని చెప్పింది. డెలివరీ కోసం రాగా.. పరీక్ష చేసిన వైద్యులు ప్రెగ్నెట్ కాదని చెప్పారు. దీంతో విస్తుపోవడం ఆమె వంతయిపోయింది. కాదు తాను గర్భవతినేనని చెబుతోంది. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగింది.
కాన్పు కోసం వస్తే..
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన ఓ మహిళ కాన్పు కోసం తిరుపతి ప్రసూతి ఆసుపత్రికి వచ్చింది. తాను కాన్పు కోసం వచ్చానని చెప్పింది. ఆమె పొట్ట కూడా బయటకు రావడంతో మిగతావారు కూడా గర్భవతి అనుకున్నారు. అయితే పరీక్ష చేసిన వైద్యులు.. గర్భమే రాలేదని చెప్పారు. దీంతో మహిళ ఆందోళనకు దిగింది. వైద్యులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. గర్భంలోని శిశువును మాయం చేసి బుకాయిస్తున్నారని మహిళతోపాటు ఆమె బంధువులు కూడా వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడుపులో గాలి బుడగలు
మహిళ, వారి బంధువుల ప్రవర్తనతో ప్రసూతి ఆసుపత్రి వైద్యులు విస్తుపోయారు. ఆస్పత్రి బయట ఆందోళన చేయడంతో అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళకు వచ్చింది గర్భం కాదని, వైద్య పరీక్షలో గాలి బుడగలు ఉన్నట్టు నిర్ధారణ అయిందని వైద్యులు చెబుతున్నారు. కడుపులోని గాలి బుడగలను ఆ మహిళ గర్భంగా భావించిందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన అలిపిరి పోలీసులు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వద్దకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఏం జరిగిందో..?
కానీ మహిళ తాను గర్భవతినని.. డెలివరీ కోసం వచ్చానని చెప్పగా.. గాలి బుడగలు అని వైద్యులు కొట్టిపారేశారు. మహిళ బంధువులు అయితే ఏకంగా శిశువునే వైద్యులు మాయం చేశారని ఆరోపించారు. దీంతో ఏం జరిగిందనే అంశం చర్చకు దారితీసింది. విచారణలో నిజనిజాలు వెలుగుచూసే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు అయితే మాత్రం సంచలనం సృష్టించింది.