రోజాలో నాటి ఫైర్ ఏమైంది: ఆపంచ్లు..కౌంటర్లు ఏమయ్యాయి: ఎందుకీ మౌనం..అదే కారణమా..!
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాలో మార్పు కనిపిస్తోంది. రోజా అంటూ పంచ్లు..టీడీపీకి కౌంటర్లు..జగన్ పైన ప్రశంసలతో హోరెత్తించేవారు. ఎలాంటి సభలో అయినా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలిచేవారు. ఇదంతా వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. రోజా రెండో సారి అధికారంలోకి వచ్చారు. వైసీపీ గెలిచిన తొలి రోజుల్లో రోజా చాలా హాపీగా కనిపించారు. మంత్రివర్గ విస్తరణ తరువాతనే మార్పు కనిపించింది. ఇక, ఇప్పుడు ఏపీఐఐసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. కానీ, ఆ ఫైర్ లేదు. ఆ పంచ్లు లేవు. టీడీపీ ముఖ్య నేతల మీద ఆనాటి తరహాలో కౌంటర్లు లేవు. ఎందుకు రోజాలో ఈ మార్పు...ఎందుకు..అసలు కారణం అదేనా..
ఫైర్ బ్రాండ్లో మిస్సయిన ఫైర్
రోజాలో ఫైర్ తగ్గింది. ఇప్పుడు వైసీపీతో పాటుగా అభిమానుల్లో ఇదే చర్చ. వైసీపీ ఎమ్మెల్యేగా తొలి సారి గెలిచి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా శాసనసభలోనూ..బయటా టీడీపీ నేతలను తన మార్క్ మాటలతో ఆడుకున్నారు. అనేక సభల్లో రోజా స్పీచ్ ల కోసమే వెళ్లేవారు. జగన్ మీద ఎవరైనా విమర్శ చేస్తే ..వెంటనే రోజా తెర మీదకు వచ్చేవారు.
ఇక, వైసీపీ అధికారం లోకి వచ్చిన తరువాత సైతం రోజా జోష్గా కనిపించారు. మంత్రివర్గ విస్తరణ వరకూ అదే ఫైర్తో ఉన్నారు. కానీ, ఆ మంత్రివర్గ విస్తరణలో రోజా ఆశలు ఫలించలేదు. ఫలితంగా నిరాశకు గురయ్యారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి సైతం హాజరు కాలేదు. అలిగి వెళ్లిపోయారు. జగన్ పిలుపుతో తిరిగి విజయవాడకు వచ్చిన సమయంలో తన ఆవేదనకు కారణాలను వివరించారు. మంత్రి పదవి ఇవ్వకపోయినా..
జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయని.. వారి మాటే చెల్లుబాటు అవుతుందని..దీని కారణంగా తాను కార్యకర్తలకు సమాధానం చెప్పుకోలేనని ఆవేదన చెందగా..జగన్ ఓదార్పు ఇచ్చారు. తగిన విధంగా గుర్తింపు ఇస్తానని హామీ ఇచ్చారు.
ఏపీఐఐసి చైర్మన్ పదవి దక్కినా..
తొలి నుండి తనను నమ్ముకొని..తన కోసం టీడీపీకి టార్గెట్ అయిన రోజాకు కీలక పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చారు. అదే సమయంలో నగరి నియోజకవర్గంలో ఏ మంత్రి వేలు పెట్టకుండా చూసుకుంటానని..ఎవరైనా రోజా నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటే సహించేది లేదని స్పష్టం చేసారు. ఏపీఐఐసీ ఛైర్మన్ గా రోజా బాధ్యతల స్వీకరణ కార్యక్రమం సైతం నిరాడంబరంగా సాగింది.
జిల్లా నుండి భూమన మినహా మరే మంత్రి..ఎమ్మెల్యే రోజా బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆ తరువాత కూడా ఎక్కడా జగన్..ప్రభుత్వం మీద అసంతృప్తి వ్యక్తం చేయకపోయినా..సభలోపలా..బయటా మాత్రం నామ మాత్రపు పాత్ర పోషిస్తున్నారు. సభ వెలుపుల ఒక్క సారి మాత్రమే మీడియాతో మాట్లాడారు. సభలో మాత్రం రోజా చాలా రిజర్వ్గానే ఉంటున్నారు. ఇక, ప్రభుత్వ నిర్ణయాల పైనా పెద్దగా స్పందించటం లేదు.
యాక్టివ్గా ఉంటే డామినేట్ చేస్తారనా..
ప్రభుత్వంలో కారణాలు ఏవైనా రోజా మాత్రం తనకు మంత్రి పదవి దక్కకపోవటం పైన మాత్రం బాధ పోలేదు. మంత్రి పదవి రాకపోవటం పైన అత్యంత సన్నిహితుల దగ్గర రోజా విలపించేసారు. ఇక..నామినేటెడ్ పదవి సైతం నెల రోజుల నిరీక్షణ తరువాత దక్కింది. అదే సమయంలో రోజాకు మంత్రి పదవి ఇస్తే పూర్తిగా డామినేట్ చేస్తారనే అభిప్రాయాన్ని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత జగన్ వద్ద వ్యక్తం చేసినట్లు సమచారం.
ఇది కూడా గతంలో మాదిరి ఫైర్ కాకుండా సంయమనంతో ఉండటానికి ఒక కారణంగా చెబు తున్నారు. ఇక, సభలో ప్రస్తుతం ప్రతిపక్ష..అధికార పక్షాల మధ్య ప్రతీ అంశంలోనూ హోరా హోరీగా మాటల యుద్దం సాగుతోంది. ఈ సమయంలో కీలక నేతలు జోక్యం చేసు కుంటున్నా..రోజా మాత్రం మౌనం పాటిస్తున్నారు. దీంతో..ఫైర్ బ్రాండ్ రోజాలో ఆ ఫైర్ తగ్గిపోవటానికి గత కారణాల పైన పార్టీలో జోరుగా చర్చలు సాగుతున్నాయి.