2020లో చిత్తూరు జిల్లా: కరోనావైరస్ నుంచి నివర్ తుఫాను వరకు..వార్తా విశేషాలు..!
2020వ సంవత్సరం చిత్తూరు జిల్లా ప్రజలకు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. ముఖ్యంగా కరోనా వైరస్, ప్రకృతి వైపరిత్యాలు, ఏనుగుల దాడులు ఇలా పలు సంఘటనలు సామాన్య ప్రజలను మరింత ఆర్థిక కష్టాల్లోకి నెట్టాయి. ఇలా, ఒకటి కాదు, రెండు కాదు, అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. జిల్లాలో 2020లో జరిగిన కొన్ని ముఖ్యాంశాలను తెలుసుకుందాం.
తొలి కరోనా కేసు
2020 లో జిల్లాలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభించింది. మార్చి 24వ తేదీన శ్రీకాళహస్తికి చెందిన యువకుడికి పాజిటివ్ నిర్ధారణ కాగా, ఆ తరువాత కేసుల సంఖ్య క్రమంగా పెరిగింది. 84 వేల 889 కేసులతో ఏపీలో అత్యధిక కేసులు నమోదైన జిల్లాగా చిత్తూరు నిలిచింది. 83 వేల 630 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, 835 మంది మృతి చెందారు. ఇంకా 424 మంది చికిత్స పొందుతున్నారు.
Recommended Video
భూకంపం, నాటు తుపాకుల కలకలం
నవంబర్ 29వ తేదీన అర్ధరాత్రి జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. రామసముద్రం మండలం కాప్పల్లి, బైరాజుపల్లిలో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో ఆ రెండు గ్రామాల ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనలతో ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. జూన్ నెలలో, జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిర్వహించిన కూంబింగ్లో 600 నాటు తుపాకులు బయటపడ్డాయి. కొందరు ఎలాంటి లైసెన్స్లు లేకుండా యధేచ్ఛగా గన్స్ వినియోగిస్తున్నట్టు గుర్తించారు. చిత్తూరు, మదనపల్లె, కేవీపల్లె, కేవీబీపురం, కార్వేటినగరం, బాకరాపేట, పలమనేరు, కుప్పం, ఎర్రవారిపాలెం ఈ నాటు తుపాకులన్నీ బయటపడ్డాయి.
అపార నష్టం మిగిల్చిన నివర్ తుఫాను
నవంబర్లో వచ్చిన నివర్ తుఫాన్ ప్రభావం చిత్తూరు జిల్లాపై తీవ్ర ప్రభావాన్నే చూపింది. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. తిరుపతిలోని ఎర్రమిట్ట, సత్యనారాయణపురం, అబ్బన్న కాలనీల్లోకి మోకాళ్లలోతు వరద నీరు చేరింది.ఆగస్టు 20 న జిల్లాలోని పూతలపట్టు మండలం బండపల్లి సమీపంలోని, ప్రముఖ సంస్థ హట్సన్ పాల డైరీలో అమ్మోనియం గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 14 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. లాక్డౌన్ ఎత్తేసిన తరువాత ఈ సంఘటన జరగడంతో, జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలన్నింటిని జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు.
రైతుకు సోనూసూద్ సహాయం
2020 లోనూ జిల్లాలో ఏనుగుల దాడులు కొనసాగాయి. గజ రాజుల దాడులతో పలువురు రైతులు మృత్యువాత పడ్డారు. పంటలకు భారీ నష్టం వాటిల్లుతోంది. సెప్టెంబర్ 27న గుడిపల్లి మండలం రాళ్లపల్లికి చెందిన పాపమ్మ అనే మహిళ ఎనుగు దాడిలో మృతి చెందింది. అలాగే, చింతరపాలెంకు చెందిన నారాయణప్ప అనే రైతు ఏనుగుల దాడిలో గాయపడ్డాడు. జిల్లాలోని మదనపల్లెకు చెందిన టమోటా రైతుకు సినీ నటుడు సోనూసూద్ సహాయం చేయడం 2020లో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. తండ్రి వ్యవసాయ పనుల్లో, కాడెద్దులుగా మారి సాయం చేసిన ఇద్దరు కూతుళ్ల వీడియో చూసి, చలించిపోయిన సోనూసూద్, జులై 26న రైతు కుటుంబానికి ట్రాక్టర్ను ఇచ్చాడు.