కుప్పం కోటపై వైసీపీ జెండా: టీడీపీకి అందనంతగా: పార్టీలకు అతీతంగా పథకాల ఎఫెక్ట్?
చిత్తూరు: మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టీ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం మీదే నిలిచింది. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కావడంతో ఫలితాలు ఎలా ఉంటాయనే విషయం చర్చనీయాంశమైంది. ఆవిర్భావం నుంచీ టీడీపీకి, చంద్రబాబుకు తప్ప మరో పార్టీ లేదా అభ్యర్థికి ఓటు వేయని ఈ నియోజకవర్గం ఇది. అలాంటి కంచుకోటలో అదికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఎలాంటి ఫలితాలను నమోదు చేయగలుగుతుందనే ఉత్కంఠత నెలకొంది.
Recommended Video
74 చోట్ల వైసీపీ..
దానికి అనుగుణంగానే ఫలితాలు వెలువడ్డాయి. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో మూడో విడతలో ఎన్నికలను నిర్వహించిన చోట మెజారిటీ పంచాయతీలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. మొత్తం 89 పంచాయతీలకు ఎన్నికలను జరగ్గా 74 స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు ఘన విజయాన్ని అందుకున్నారు. తెలుగుదేశం పార్టీ 14 పంచాయతీలకు మాత్రమే పరిమితమైంది. ఈ రిజల్ట్.. వైసీపీలో నూతనోత్తేజాన్ని నింపింది. తెలుగుదేశం పార్టీ పునాదులతో సహా కదిలిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
పార్టీలకు అతీతంగా..
చిత్తూరు జిల్లాకే చెందిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.. కుప్పం పంచాయతీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని, చావో రేవో అన్నట్లు పోరాడారని జిల్లా వైసీపీ నాయకులు వ్యఖ్యానిస్తున్నారు. అత్యధిక పంచాయతీల్లో విజయం సాధించడానికి మంత్రి పెద్దిరెడ్డి పక్కా వ్యూహాలను రూపొందించడం.. దాన్ని అంతే పక్కాగా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఆశించిన స్థాయి కంటే ఎక్కువ ఫలితాలు రాగలిగాయని అంటున్నారు. టీడీపీతో పోటీ పడితే చాలని తొలుత భావించామని, ఆ పార్టీకి అందనంత స్థాయిలో అత్యధిక స్థానాలను వస్తాయని ఊహించలేదని చెబుతున్నారు.
పార్టీలకు అతీతంగా పథకాలు..
జగన్ సర్కార్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారనడానికి కుప్పం పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని స్పష్టం చేస్తోన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందనడానికి ఇంతకంటే సాక్ష్యం మరొకటి ఉండబోదని వైసీపీ జిల్లా నాయకులు తేల్చి చెబుతున్నారు. ఇదే ఊపును 2024 అసెంబ్లీ ఎన్నికల వరకూ కొనసాగించాల్సి ఉంటుందని, అదే జరిగితే- కుప్పం నియోజకవర్గంపై పార్టీ జెండా ఎగరడం ఖాయమనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో వైసీపీ మద్దుతదారులతో మంత్రి పెద్దిరెడ్డి భేటీ..
కుప్పం పంచాయతీల్లో విజయం సాధించిన వైసీపీ మద్దతుదారులతో మంత్రి పెద్దిరెడ్డి భేటీ కానున్నారు. పార్టీ, గుర్తు రహితంగా ఈ ఎన్నికలు నిర్వహించినందున తాము సాధించిన విజయాన్ని, పంచాయతీల సంఖ్యను టీడీపీ తక్కువ చేసి చూపిస్తోందని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. వాస్తవ పరిస్థితి.. ఫలితాలు ఏమిటో నిరూపించడానికి పెద్దిరెడ్డి వారితో సమావేశమౌతారని చెబుతున్నారు. వైసీపీ మద్దతుతో విజయం సాధించిన సర్పంచ్ల పేర్లు, ఫొటోలు, పంచాయతీ వివరాలను ఆయన మంత్రి హోదాలో వెల్లడిస్తారని అంటున్నారు.