IPL 2020: విధ్వంసం సృష్టించేందుకు వార్నర్ రెడీ.. బెంగళూరుకు ముందస్తు వార్నింగ్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. తొలిమ్యాచ్లో భాగంగా డేవిడ్ వార్నర్ జట్టు సెప్టెంబర్ 21 సోమవారం రోజున రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్కు వేదికగా నిలుస్తోంది దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం. ఇక ఈ సారి టోర్నమెంట్లో సన్రైజర్స్ తరపున తిరిగి కెప్టెన్సీ బాధ్యతలను చేపడుతున్నాడు ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్.
డేవిడ్ వార్నర్... విధ్వంసకర బ్యాట్స్మెన్. ప్రతి ఏటా హైదరాబాదు జట్టు ఈ విధ్వంసకర బ్యాట్స్మెన్ పైనే ఆధారపడుతుందని చెప్పడంలో సందేహం లేదు. వార్నర్ బరిలోకి దిగాడంటే చాలు ఆరోజు తనదైతే ప్రత్యర్థికి పట్టపగలే చుక్కలు కనిపించడం గ్యారెంటీ. ఆ స్టయిల్లో తన బ్యాటింగ్ విధ్వంసం ఉంటుంది. వార్నర్కు ఒక బంతి వేసిన బౌలర్కు మరో బంతి వేయాలంటే చెమటలు పడుతాయి. బంతి ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే బంతిని ఎక్కడ వేసినా దాని గమ్యం మాత్రం బౌండరీ వద్దే ఉంటుంది. ఇక వార్నర్ కెప్టెన్సీలోనే 2016లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. ఆ సమయంలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పై విజయం సాధించింది. అయితే ఓ వివాదంలో చిక్కుకున్న వార్నర్ పై అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి నిషేధం కొంత సమయం వరకు విధించడంతో 2018లో టోర్నీకి దూరమయ్యాడు.
2019 ఐపీఎల్లో తిరిగి వార్నర్ జట్టులో చేరినప్పటికీ అతన్ని కాదని న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్కు సన్రైజర్స్ యాజమాన్యం కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఆ సమయంలో వైస్ కెప్టెన్గా భువనేశ్వర్ కుమార్ను ఎంపిక చేసింది. అయితే 2018లో సన్రైజర్స్ జట్టు రన్నర్స్గా నిలిచింది. ఇక డేవిడ్ వార్నర్తో పాటు జానీ బెయిర్స్టో, కేన్ విలియమ్సన్లు టాప్ ఆర్డర్లో ఉన్నారు. అయితే మరోసారి సన్రైజర్స్ చెలరేగిపోయి ఆడుతుందని ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ను వ్యక్తం చేస్తున్నారు. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే భువనేశ్వర్ కుమార్, రశీద్ ఖాన్, మొహ్మద్ నబీ, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మలతో బలోపేతంగా కనిపిస్తోంది.