"Animals never Rape":హాథ్రస్ ఘటనపై స్టార్ డైరెక్టర్ పూరీ ఫైర్..సుశాంత్ సింగ్, డ్రగ్స్ వ్యవహారంలో.!
ఎప్పుడూ మెగా ఫోన్తో బిజీగా ఉండే స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్... దేశంలో ప్రస్తుతం జోరుగా చర్చకు వస్తున్న కొన్ని ఘటనలపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తన వాయిస్ను ఆడియో రూపంలో విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా సుశాంత్ సింగ్ మృతి కేసు, డ్రగ్స్ వ్యవహారం, నెపోటిజం వంటి అంశాలపై పూరీ గళమెత్తారు. మొత్తం 5 నిమిషాల 45 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో పలు అంశాలను ప్రస్తావించారు పూరీ జగన్నాథ్.
మహిళల కోసం మహిళలే పోరాడుతున్నారు
దేశంలో అత్యాచారాలు, డ్రగ్స్ వ్యవహారం పెరిగిపోతున్న నేపథ్యంలో మీడియా చేస్తున్న హడావుడిపై ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ట్విటర్ వేదికగా ఆయన తన గళం విప్పారు. ఇండియాలో ప్రతి పావుగంటకు ఒక రేప్ జరుగుతోందని ప్రతి రోజు వందల సంఖ్యలో అత్యాచారం కేసులు నమోదవుతున్నాయని చెప్పిన పూరీ...రోజుకు నాలుగు లక్షలకు పైగా మహిళపై క్రైమ్స్ జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలోనే హాథ్రస్ ఘటన గురించి పూరీ చెప్పారు. న్యాయం జరగడం అలా పక్కన పెడితే... మహిళకు అన్యాయం జరిగితే న్యాయం కోసం పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. అంతేకాదు కొంతమంది జర్నలిస్టులు న్యాయం జరగడం కోసం తమ వంతు కృషి చేస్తున్నారని అయితే వీరంతా మహిళలే కావడం ఇక్కడ గుర్తించాల్సిన విషయమన్నారు. ఆడవారే ఆడవాళ్ల కోసం పోరాడుతున్నారని మగవారికి బాధ్యత లేదా అని పూరీ ప్రశ్నించారు. నిజమైన జర్నలిస్టుకు సెల్యూట్ చేయాలని అన్నారు. ఇక మిగతా మీడియా మొత్తం ఫెస్టివల్స్తో బిజీ అయిపోయిందని ఎద్దేవా చేశారు.
సుశాంత్ సింగ్ ఒక్కడే కాదు.. ఆ సమయంలో..
కొద్ది రోజుల వరకు మీడియా సూసైడ్ ఫెస్టివల్ నిర్వహించిందని చెప్పిన ఈ "పోకిరి" డైరెక్టర్ సుశాంత్ సింగ్ ఒక్కడే మృతి చెందలేదని.. ఆ సమయంలో 300 మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారని వారిగురించి ఎవరూ పట్టించుకోరని మండిపడ్డారు. గాల్వాన్ ఘటనలో మృతి చెందిన సైనికుల పేర్లు ఎవరికీ గుర్తుండవని చెప్పారు. సూసైడ్ ఫెస్టివల్ అవగానే నెపోటిజం ఫెస్టివల్కు మీడియా తెరలేపిందన్నారు. అంతా కలిసి ఒక్కరిని తొక్కేస్తున్నారని వరుస కథనాలు ప్రసారం చేస్తున్న మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన...కొత్త హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయని అయితే ఒక్క థియేటర్ అయినా హౌజ్ఫుల్ అవుతోందా అని ప్రశ్నించారు. కొత్త హీరోను ఎంకరేజ్ చేద్దామని ఎప్పుడైనా టికెట్ కొన్నారా అని ప్రశ్నలు సంధించారు పూరీ.
బడాబాబులు డ్రగ్స్ వాడటం లేదా...
ఇక చివరిగా డ్రగ్స్ ఫెస్టివల్ గురించి పూరీ ప్రస్తావించారు. సెలబ్రిటీలను తీసుకెళ్లి ఫ్యాషన్ పరేడ్ చేయిస్తారని అయితే వారు డ్రగ్స్ పెడ్లింగ్ చేయరు కానీ మహా అయితే డ్రగ్స్ తీసుకుని ఉంటారని చెప్పారు. ఈ విషయం పోలీసులకు కూడా తెలుసని అన్నారు. అయితే సెలబ్రిటీలు మాత్రమే డ్రగ్స్ వాడుతున్నారా అని ప్రశ్నించారు పూరీ. ఇందులో బడా బాబులు, రాజకీయనాయకుల పిల్లల పేర్లు ఎందుకు మాయమవుతున్నాయని పూరీ ప్రశ్నించారు. డ్రగ్స్ కోసం ఇంత హడావుడి చేస్తున్నవారు కింగ్పిన్ను డ్రగ్ లాడెన్ను పట్టుకున్నారా అని ప్రశ్నించారు.మీడియా హడావుడితో పల్లెటూర్లలో కూడా పిల్లలకు డ్రగ్స్ అంటే ఏంటో తెలిసిపోయిందని పూరీ మండిపడ్డారు. అంతేకాదు 30శాతం డ్రగ్స్ బిజినెస్ ఇండియాలో పెరిగిందన్నారు.
Recommended Video
అవినీతిపరులను ఇలానే రోడ్డుపైకి లాగుతున్నారా..?
పోలీసుల ఎదుటే సాధువులు గంజాయి తీసుకుంటుంటే ఎవరేమి ప్రశ్నించరు కానీ యాంగ్జైటీ కోసం ఒక సెలబ్రిటీ తీసుకుంటే మాత్రం హడావుడి చేసేస్తారని పూరీ ఫైర్ అయ్యారు. ఎంతో మంది అవినీతికి పాల్పడుతున్నారని వారందరినీ ఇలానే టీవీల్లో చూపిస్తున్నారా అని సూటిగా ప్రశ్నించిన పూరీ... ఆడవారిని మీడియా ముందుకు లాగడం మానేయాలని సూచించారు. ఆడవారికి న్యాయం జరిగేలా పోరాడాలని హితవు పలికారు.తెలంగాణలో దిశకు జరిగిన న్యాయం దేశంలో అందరికీ జరగాలని చెప్పిన పూరీ... స్వాతంత్ర్య దినోత్సవం రోజున అంతా త్రివర్ణ పతకానికి సెల్యూట్ చేస్తున్న వేళ ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన విషయం తెలుసా అని ప్రశ్నించారు పూరీ. కేవలం స్వాతంత్ర్యం దినోత్సవం రోజున మాత్రమే భారత్ మాతా కీ... అంటున్న మనం ప్రతిరోజు తేరీ మాకీ మాకీ అంటున్నామని ముందు ఇది మారాలని అన్నారు పూరీ జగన్నాథ్.