పంచాయతీ ఏకగ్రీవానికి రూ.52 లక్షలు.. అందరూ కలసిరావాలనే మెలికతో బ్రేక్..
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల వేళ ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్లు ప్రకటన చేయడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆగ్రహాం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే తూర్పు గోదావరి జిల్లాలో ఓ పంచాయతీ చర్చకు దారితీసింది. ఏకగ్రీవం కోసం భారీగా నగదు చేతులు మారినట్టు తెలుస్తోంది. అంతమొత్తంలో నగదు బదిలీ జరగడంతో ఎన్నికల సంఘం దృష్టిసారించింది.
వేలం పాట..
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం మేజర్ పంచాయతీ గ్రామం రాజపూడిలో ముందస్తు ఒప్పందం జరిగింది. నామినేషన్ ప్రక్రియ ముందుగానే ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరినట్టు సమాచారం. గ్రామానికి చెందిన నాయకులు ఒకచోట చేరి గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవంగా సర్పంచ్ను ఎన్నుకునేందుకు సన్నద్ధమయ్యారు. ఇందుకోసం వారు వేలం పాట నిర్వహించుకున్నట్టు తెలిసింది. ఓ వర్గం రూ. 51 లక్షలకు పాట పాడగా, రెండోవర్గం రూ. 52 లక్షల అధిక మొత్తంతో పాట దక్కించుకున్నట్టు తెలుస్తోంది. గ్రామంలో అన్ని సామాజిక వర్గాలు కలిసి వస్తేనే ఈ పాట పాడుకున్న వ్యక్తి సొమ్ములు చెల్లిస్తానని మెలిక పెట్టడంతో కొంత సందిగ్ధత నెలకొంది.
మెలిక పెట్టడంతో..
గ్రామ పెద్దలు మాత్రం గ్రామాభివృద్ధికి సహకరించడానికి ప్రధాన పార్టీల వ్యక్తులను బుజ్జగించి ఏకగ్రీవానికి నామినేషన్ ప్రక్రియ ముందే సన్నాహాలు జరిపారు. గతంలో కూడా ఈ గ్రామ పంచాయతీలో కొన్నిమార్లు ఏకగ్రీవంగా గ్రామాభివృద్ధి కోసం వేలంపాట వేసుకుని వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సారి ఇది పూర్తి స్థాయిలో జరుగుతుందా.. అధికార పార్టీ ఏమైనా అడ్డంకులు కల్పిస్తుందా అనే సందేహం ఉంది. ఇందుకు తగ్గట్టుగా గ్రామస్తుల తీర్మానానికి గ్రామానికి చెందిన వైసీపీ నేతలు అంగీకరించకపోవడంతో కథ మొదటికి వచ్చింది.
పదవీ వదులుకోను..? కానీ..
సర్పంచ్ పదవీని వదులుకునే ప్రసక్తి లేదని సదరు వ్యక్తి చెబుతున్నారు. గతంలో పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందానని, వివరించారు. ప్రస్తుతం ప్రజలు తనకు పూర్తిస్థాయిలో మద్దతునిస్తున్నారని, ఈ క్రమంలో వేలం పాట నిర్వహించడం తనకు అంగీకారం కాదని తెలిపారు. ఈ విషయాన్ని పెద్దలకు తెలియజేశారు. గ్రామాభివృద్ధి కోసం భారీ విరాళం ప్రకటించిన వ్యక్తికే మద్దతు పలకాలని గ్రామస్తులు నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.