గోదావరిలో పడిపోయిన యువకుడు: కాపాడిన కానిస్టేబుల్, ప్రయాణికులు
తూర్పుగోదావరి: జిల్లాలోని ఆలమూరు మండలం జొన్నాడ గౌతమి వంతెన పైనుంచి ప్రమాదవశాత్తు ఓ యువకుడు గోదావరిలో పడ్డాడు. అయితే, ఓ పోలీసు కానిస్టేబుల్ చూపిన సమయస్ఫూర్తితో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ కానిస్టేబుల్కు పలువురు స్థానికులు కూడా సహకరించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కపిలేశ్వరం మండలం అంగార గ్రామానికి చెందిన ఎర్ర రమేశ్ మంగళవారం రావులపాలెంకు పని నిమిత్తం వచ్చి తిరిగివెళ్తున్నాడు. కాగా, జొన్నాడ గౌతమి వంతెన వద్దకు రాగానే తన బైక్లో పెట్రోల్ అయిపోయింది. దీంతో పెట్రోల్ తీసుకురమ్మని తన తండ్రి రాంబాబుకు ఫోన్ చేసి చెప్పాడు.
ఆ తర్వాత వంతెన సైడ్ వాల్స్పై కూర్చున్న రమేశ్.. ప్రమాదవశాత్తు గోదావరిలో పడిపోయాడు. అయితే, నదిలోని వంతెన పట్టుకుని ఆగాడు. అటుగా వెళ్తున్న ఆలమూరు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ప్రభాకర్ రావు ఈ విషయాన్ని గమనించాడు. వెంటనే వంతెనపై వెళ్తున్న ఇతర ప్రయాణికులను ఆపి అప్రమత్తం చేశాడు.
ఓ వ్యాన్లో ఉన్న తాడును గోదావరి వంతెన పైనుంచి కిందికి వేసి.. ఇతర ప్రయాణికులతో కలిసి ఆ యువకుడిని పైకి లాగారు. సురక్షితంగా యువకుడు బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
కాగా, ఆ యువకుడు సెల్ఫీ తీసుకుంటూ గోదావరిలో పడిపోయాడని అటుగా వెళ్తున్న ప్రయాణికులు చెప్పడం గమనార్హం. ఆలమూరు ఎస్సై శివప్రసాద్ ఘటనా స్తలానికి చేరుకుని వివరాలను తెలుసుకున్నారు. కాగా, సమయస్ఫూర్తితో వ్యవహరించి యువకుడ్ని కాపాడిన కానిస్టేబుల్ ప్రభాకర్ ను అక్కడున్నవారు అభినందించారు.