తండ్రిని చంపి.. ఇంటి వెనుక పూడ్చి..
కాకినాడ : పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తారంటారు. వృద్ధాప్యంలో అండగా ఉంటాడని తల్లిదండ్రులు భావిస్తారు. అలా అనుకునే ఓ వ్యక్తి ఒక అబ్బాయిని దత్తత తీసుకున్నాడు. కన్న కొడుకు కన్నా గారాభంగా పెంచారు. అయితే తలకొరివి పెడతాడనుకున్న దత్తపుత్రుడే అతని పాలిట యమకింకరుడయ్యాడు. తండ్రిని చంపి శవాన్ని ఇంటి వెనుక పూడ్చిపెట్టాడు. కాకినాడలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మాటల్లో కాదు చేతల్లో చూపండి.. అలీగఢ్ ఘటనపై శివసేన ఆగ్రహం
రెండు నెలల క్రితం అదృశ్యం
కాకినాడకు చెందిన గోపిరెడ్డి ఈశ్వర్ రమణయ్యపేట గ్రామ పంచాయితీ పరిధిలోని బర్మా కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య, నలుగురు సంతానం. అయితే అందరూ ఆడపిల్లలే కావడంతో ఒక అబ్బాయిని దత్తత తీసుకున్నాడు. ముగ్గురు ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపాడు. తాగుడు అలవాటున్న ఈశ్వర్ రెండు నెలల క్రితం మద్యం మత్తులో భార్య, కొడుకు కుమార్తో గొడవపడ్డాడు. ఆ తర్వాత ఎవరికీ కనిపించకుండా పోయాడు.
తండ్రిని చంపి
ఘటన జరిగిన కొన్ని రోజులకు ఏప్రిల్ 17న భర్త కనిపించడంలేదంటూ ఈశ్వర్ భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కంప్లైట్ నమోదుచేసుకున్న తిమ్మాపురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా.. కుమార్ ఆదివారం తన తండ్రిని తానే చంపి ఇంటి వెనుక పూడ్చిపెట్టానని బాబాయితో చెప్పాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని వెలికితీశారు.
నిందితుడి ఆత్మహత్య యత్నం
ఈశ్వర్ తరచూ తాగివచ్చి వేధిస్తుండటంతో ఆ బాధ తాళలేక తల్లితో కలిసి తండ్రిని చంపినట్లు కుమార్ అంగీకరించాడు. హత్య విషయం అందరికీ తెలియడంతో నిందితుడు మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం కుమార్ కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.