ఏపీలో మరో ఘటన ... తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం వద్ద హనుమాన్ విగ్రహం ధ్వంసం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన మరువకముందే, విజయవాడ కనకదుర్గ ఆలయం లోని వెండి రథం లో మూడు సింహాలు మాయమవడం, ఆ తరువాత నిడమానూరులోని సాయిబాబా విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన ఏపీలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం లో ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
ఏపీ ఆలయాల్లో వరుస ఘటనలు.. నిడమానూరులో సాయిబాబా విగ్రహం ధ్వంసం
ఏలేశ్వరం మండలంలోని శివాలయం దగ్గర్లో గల శ్రీ సీతారామాంజనేయ వ్యాయామ కళాశాల వద్ద ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు విరగ్గొట్టారు. ఆంజనేయ స్వామి విగ్రహంలో చేతి భాగాన్ని ధ్వంసం చేయడంతో స్థానికులు భగ్గుమంటున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విగ్రహ ధ్వంసం నేపథ్యంలో హిందూ సంఘాలు మండి పడుతున్నాయి. ప్రభుత్వ అసమర్థత, పోలీసుల నిర్లక్ష్య వైఖరి వల్ల హిందూ ఆలయాలపైన, హిందూ దేవుళ్ళ విగ్రహాలపైన దాడులు జరుగుతున్నాయని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
విగ్రహ ధ్వంసం నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఎటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు నిఘా ఉంచారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఈ ఘటనకు బాధ్యులు ఎవరు అన్నదానిపై దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఏపీ లో జరుగుతున్న వరుస ఘటనలు ఏపీ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారుతున్నాయి. ప్రతిపక్షాలు ఆలయాల్లో వరుస ఘటనలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.