రేపే జగన్ పోలవరం సందర్శన..! సీఎం హోదాలో తొలిసారి..!!
అమరావతి/హైదరాబాద్ : ప్రతిపక్ష హోదాలో జగన్ మోహన్ రెడ్డి పోలవరాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. తాజాగా సీఎం హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ.. రేపు వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించి అధికారులతో పూర్తి స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారని అన్నారు.ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో సహా మొత్తం అన్ని అంశాలపై వైఎస్ జగన్ సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. జూలై 15 తర్వాత వచ్చే వరదల బారిన పడే అవకాశమున్న 48 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని వెల్లడించారు. గడిచిన 6 నెలల్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్లో జరిగిన పనులను పరిశీలించేందుకు సీఎం వైఎస్ జగన్ ఒక కమిషన్ను ఏర్పాటు చేశారని తెలిపారు. 25 శాతం లోపు పనులు జరిగిన ప్రాజెక్టుల పరిస్థితి సమీక్షిస్తామని పేర్కొన్నారు.
అంతే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన పార్లమెంట్లో జరుగుతున్న అఖిలపక్ష సమావేశానికి వైసీపీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హజరయ్యారు. జమిలి ఎన్నికలు(పార్లమెంట్, అసెంబ్లీకు) ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, 2022లో 75వ దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, ఈ ఏడాది జరిగే మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చకు రాబోతున్నాయి. కాగా ఈ సమావేశానికి కేజ్రివాల్, చంద్రబాబు,మాయావతి,అఖిలేష్ మరియు మమత బెనర్జీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణ నుంచి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్, ఏపీ నుండి వైఎస్ జగన్,నితీష్ కుమార్, ఫరూఖ్ అబ్దుల్లా, నవీన్ పట్నాయక్, మెహబూబా ముప్తీ, సురవరం సుధాకర్ రెడ్డి, సీతారామ్ ఏచూరి, బీజేపి వర్కింగ్ ప్రెసిడెంట్ జే.పి. నడ్డా, శరద్ పవార్, ఎంఐఎం అధ్యక్షుడు ఒవైసీ హజరయ్యారు. మిత్రపక్షమైన శివసేన ఈ సమావేశానికి గైర్హాజరైంది. ఈరోజు ఆ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హజరుకాలేకపోతున్నట్లు తెలిపారు.