ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు షాకిచ్చిన జనసైనికులు: రాజోలులో సత్తాచాటారు
తూర్పుగోదావరి: రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు జనసేన శ్రేణులు భారీ షాకిచ్చాయి. ఆయన జనసేన నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే అయినప్పటికీ.. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే అన్ని విషయాల్లోనూ మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పలుమార్లు ప్రసంశలు కూడా కురిపించారు.
జనసేన విజయాలు అసామాన్యం: శాసించే స్థాయికి ఎదగాలంటూ పవన్ కళ్యాణ్
రాజోలులో సత్తా చాటిన జనసేన..
వైసీపీలో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ.. ఆయన జనసేన రెబల్ ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన రాజోలులో సత్తా చాటడం గమనార్హం. ఎమ్మెల్యే రాపాక ప్రమేయం లేకుండానే జనసైనికులు తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకోవడం గమనార్హం. 10 మంది సర్పంచులను గెలిపించుకోవడం విశేషం.
రాపాక వరప్రసాద్ వైసీపీకి మద్దతు తెలిపినా..
అయితే, జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీకి మద్దతు పలికినప్పటికీ.. జనం మాత్రం జనసేన మద్దతుదారులకే జై కొట్టారు. పడమటిపాలెం, కేశవదాసుపాలెం, టెకిశెట్టిపాలెం, ఈటుకూరు, మేడిచర్ల పాలెం, కాట్రేనిపాడు, రామరాజులంక, కూనవరం, కత్తిమండ, బట్టేలంకలో జనసేన మద్దతుదారులు ఘన విజయం సాధించారు.
రాపాకపై జనసైనికుల గుర్రు.. సరైన సమయం చూసి..
జనసేన నుంచి గెలిచి.. వైసీపీకి మద్దతుగా ఉండటం పట్ల జనసైనికులు రాపాక వరప్రసాద్పై గుర్రుగా ఉన్నారు. సరైన సమయంలో కోసం ఎదురుచూస్తున్న జనసేన శ్రేణులు.. ఈ పంచాయతీ ఎన్నికల్లోనే తమ బలం ఎంటో చూపించారు. తమ పార్టీ అధినేతకు వెన్నుపోటు పొడిచిన ఎమ్మెల్యేకు తగిన గుణపాఠం జరిగిందని జనసేనైనికులు చెబుతుండటం గమనార్హం.
జనసేన విజయాల పట్ల పవన్ కళ్యాణ్ ఆనందం
రాజోలులో పది స్థానాల్లో జనసేన మద్దతుదారులు గెలవడంతో పార్టీ కార్యకర్తలు, నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అంతేగాక, ఎమ్మెల్యే రాపాకను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. కాగా, నాలుగు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సగానికిపైగా అధికార వైసీపీ మద్దతుదారులే గెలుపొందారు. ఆ తర్వాత స్థానంలో టీడీపీ నిలిచింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపని జనసేన..ఈ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఊహించని విధంగా ఫలితాలను సాధించింది. జనసేన మద్దతుదారుల విజయాల పట్ల ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేస్తూ ఇప్పటికే వారికి శుభాకాంక్షలు తెలిపారు.