క్రికెట్ బెట్టింగుతో బ్యాంకుకు కన్నం.. ఉద్యోగి దొంగలా మారిన వైనం..!
రాజమండ్రి : చెడు అలవాట్లు మనిషిని ఎంతలా దిగజారుస్తాయో అనడానికి తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఘటన నిలువుటద్దంలా నిలుస్తోంది. నెల జీతంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతున్న ఓ బ్యాంకు ఉద్యోగి జీవితంలో క్రికెట్ బెట్టింగ్ చిచ్చు రేపింది. మొదట్లో హాబీగా అలవాటైన బెట్టింగ్ రానురాను అతడి జీవితంలో చీకట్లు నింపింది. ఆ వ్యసనానికి బానిసై.. పనిచేస్తున్న సంస్థకే కన్నం పెట్టాల్సిన పరిస్థితి. రోజుకు కొంత మొత్తం దొంగిలిస్తూ చివరకు అధికారులకు పట్టుబడ్డాడు. నగదు, ఆభరణాలు కలిపి లక్షల్లో మాయం చేయడం గమనార్హం.
పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం.. క్రికెట్ బెట్టింగ్ పర్యవసానం..!
తూర్పు గోదావరి జిల్లా కోవూరు మండలం అల్లూరులోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో దోసరి నాగబాబు అనే వ్యక్తి మూడేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో అత్యంత నమ్మకమైన, అతి కీలకమైన క్యాషియర్ ఉద్యోగం చేస్తున్నారు. ఆ క్రమంలో అల్లూరులోనే నివసిస్తున్నారు. అయితే నెలనెలా జీతం వచ్చే మంచి బ్యాంక్ ఉద్యోగంపై సరిగా దృష్టి పెట్టకుండా ఈజీ మనీ కోసం వెంపర్లాడారు. ఆ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్కు అలవాటు పడి విలువైన జీవితం నాశనం చేసుకున్నారు.
అదే పనిగా క్రికెట్ బెట్టింగులు కాస్తూ పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నారు నాగబాబు. తన దగ్గర డబ్బులు లేకున్నా.. అప్పులు చేసి మరీ క్రికెట్ బెట్టింగులు కాశారు. ఆ క్రమంలో అప్పులు ఇచ్చినోళ్లు వత్తిడి పెంచడంతో ఏమీ చేయాలో తోచక పనిచేస్తున్న సంస్థకే కన్నం పెట్టేశారు.
దళితుడి శవంతో సర్కస్ చేయాల్సి వచ్చిన గ్రామస్తులు.. బ్రిడ్జిపై నుంచి కిందకు దించి..!(వీడియో)
కస్టోడియన్ను ఏమార్చి.. బ్యాంకు సొత్తు దొంగిలించి..!
ప్రతి రోజు సాయంత్రం బ్యాంక్ పని వేళలు ముగిశాక కస్టోడియన్ మునిస్వామితో కలిసి నాగబాబు నగదు లెక్కలు సరిచూసి లాకర్లో డబ్బు పెట్టాల్సి ఉంటుంది. ఆ క్రమంలో కస్టోడియన్ మునిస్వామిని నమ్మించిన నాగబాబు.. రోజుకు కొంత డబ్బు దొంగిలించడం పనిగా పెట్టుకున్నారు. అంతేకాదు లాకర్లలో నుంచి కస్టమర్లకు సంబంధించిన బంగారు ఆభరణాలను సైతం చోరీ చేశారు. కొద్ది రోజుల పాటు నాగబాబు డ్రామా బాగానే ఆడినా.. చివరకు కస్టోడియన్ మునిస్వామి మేల్కొనడంతో విషయం కాస్తా గుట్టురట్టైంది.
ఈ నెల 16వ తేదీన మునిస్వామి నగదు లావాదేవీలను పరిశీలించగా తేడా కనిపించింది. ఆ క్రమంలో మేనేజర్ రవిచంద్రకు ఫిర్యాదు చేశారు. సీసీటీవి ఫుటేజ్ పరిశీలించడంతో నాగబాబు నగదు, నగలు దొంగిలించినట్లు తేలింది. దాంతో అల్లూరు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో కేసు ఫైల్ చేశారు.
6 లక్షలకు పైగా మాయం.. కోర్టుకు చేరిన కథ..!
కస్టోడియన్ మునిస్వామిని ఎప్పటికప్పుడూ ఏమార్చుతూ దాదాపు 6 లక్షల 32 వేల రూపాయల సొత్తు వరకు దొంగిలించారు నాగబాబు. అందులో 5 లక్షల 40 రూపాయల నగదు.. మిగతా మొత్తం బంగారు నగలకు సంబంధించి ఆయన దొంగిలించినట్లుగా గుర్తించారు. మేనేజర్ రవిచంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. అల్లూరు పాత బస్స్టాండ్ సమీపంలో కనిపించిన నాగబాబును అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కొంత నగదుతో పాటు గోల్డ్ జ్యువెలరీ స్వాధీన పరుచుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. అదలావుంటే నాగబాబు చోరీ కేసులో కస్టోడియన్ మునిస్వామికి సంబంధం లేదని తేల్చారు పోలీసులు.