ఇటు జగన్ సీరియస్..అటు ప్రధాని పలకరింపు..పాదాభివందనం: ఆ వైసీపీ ఎంపీ బీజేపీలోకేనా..!
వైసీపీ లో ఇప్పుడు ఒక ఎంపీ పైన ఆసక్తి కర చర్చ సాగుతోంది. పార్టీ నేతలు ఆయన వైపు అనుమానుపు చూపులు చూస్తున్నారు. కొద్ది రోజులుగా ఆయన వ్యవహార శైలి వైసీపీ నేతలకు అనుమానం కలిగిస్తోంది. ఇదే వ్యవహారం ఇప్పుడు ముఖ్యమంత్రి వరకు వెళ్లింది. ఆయన తాజాగా లోక్ సభలో ఆ ఎంపీ చేసిన ప్రసంగం పైన జరగిని చర్చ పైన ఆరా తీసారు. సంబంధిత ఎంపీకి క్లాస్ తీసుకోవాల్సిందిగా మరో సీనియర్ నేతకు సీఎం సూచించారు. అయితే, ముఖ్యమంత్రి ఆ ఎంపీ పైన ఆగ్రహానికి అసలు కారణం అది కాదనీ...ఢిల్లీలో ఆయన శైలి పైన వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే సీఎం సీరియస్ అయ్యారని తెలుస్తోంది. దీంతో.. ఇక ఇప్పుడు ఆ ఎంపీకి హెచ్చరికలు చేసిన తరువాత సైతం మార్పు వచ్చిందా లేదా అనే దాని పైన వైసీపీ ఫోకస్ చేసింది. ఇదే సమయంలో ప్రధాని మోదీ పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ప్రత్యేకంగా రఘురామ రాజును పలకిరించటంత..ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తోంది.
ఏపీలో ఇంగ్లీష్ మీడియం రచ్చ ... తన వ్యాఖ్యలపై ఎంపీ క్లారిటీ .. జగన్ ఓకే అంటారా ?
బీజేపీకి రఘురామక్రిష్టంరాజు దగ్గరవుతున్నారా
2014 ఎన్నికల ముందు టీడీపీ నుండి రఘు రామ క్రిష్టంరాజు వైసీపీలో చేరారు. ఆ వెంటనే ఆయనకు నర్సాపురం లోక్ సభ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు. ఎంపీ అయిన తరువాత స్వతహాగా పారిశ్రామిక వేత్త అయిన రఘురామ రాజు అప్పటికే బీజేపీ నేతలతో ఉన్న సంబంధాలను పునరుద్దరించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్న విషయం. ఎంపీగా బీజేపీ నేతలతో సఖ్యతగా ఉండటం తప్పు కాదని..అయితే అవసరానికి మించి.. తన అవసరాల కోసం వారికి దగ్గరవ్వటం పైనే ముఖ్యమంత్రికి ఫిర్యాదులు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎంపీగా ఎన్నికైన సమయం నుండే ఇదే కంగా వ్యవహరి స్తుండటం ముఖ్యమంత్రి కి కొందరు చేరవేసారు. దీని పైన ఒక సీనియర్ నేత ద్వారా సూచనలు అందాయి. అయినా..ఆయన తీరులో మార్పు రావటం లేదని వైసీపీ సీనియర్లు సీఎంకు నివేదించారు.
ప్రధాని పలకరింపుతో మరింత అనుమానాలు
పార్లమెంటు సెంట్రల్ హాల్ వద్ద నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజీ ని పిలిచి ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించారు. కరచాలనం చేస్తూ... రఘురామకృష్ణ రాజు భుజం తట్టిన ప్రధానమంత్రి ఎలా ఉన్నారంటూ ప్రశ్నించారు. రాజ్యసభ నుంచి తన చాంబర్ కు వెళుతూ సెంట్రల్ హాల్ లో రఘరామ రాజుతో ప్రధాని ముచ్చటించారు. అదే సమయంలో రఘురామకృష్ణ రాజు పక్కనే ఉన్న ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఇతర ఎంపీలు ఉన్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ రఘురామ రాజు మీద ఆగ్రహం వ్యక్తి చేసిన రెండు రోజులకే పార్లమెంట్లో ఈ పరిణామం చోటు చేసుకోవటం యాధ్రుచ్చికమో..ఉద్దేశ పూర్వకమో అంటూ వైసీపీ ఎంపీల్లో చర్చ మొదలైంది.
గతంలో బీజేపీలో.. తరువాత టీడీపీలో
రఘురామ క్రిష్టం రాజు తొలుత బీజేపీలో ఉండేవారు. వైయస్ రాజశేఖర రెడ్డికి ఆయన బంధువు. 2014 ఎన్నికల్లో బీజేపీ నుండి నర్సాపురం ఎంపీగా టిక్కెట్ దక్కించుకొనేందుకు ప్రయత్నాలు చేసినా..చివరకు గోకరాజు గంగరాజుకు సీటు దక్కింది. ఆ తరువాత ఆయన కొంత కాలం బీజేపీలోనే ఉన్నా..తరువాత టీడీపీలో చేరారు. ఇక, ఎన్నికల సమయం ముందు వైసీపీలో జాయిన్ అయ్యారు. చిరకాల కోరిక అయిన ఎంపీ అయ్యారు. అయతే, పారిశ్రామికంగా రఘురామరాజు ఆర్దికంగా ఇబ్బందుల్లో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో..కేంద్ర ప్రభుత్వ సహకారంతో తిరిగి పారిశ్రామికంగా ఎదిగేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని..అయితే అదే సమయంలో జగన్ నాయకత్వం మీద ఆయనకు విశ్వాసం ఉందని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు.
సీఎం జగన్ సీరియస్ తరువాత..
లోక్ సభలో ఏపీలో ఇంగ్లీషు మీడియం పాఠశాలల ఏర్పాటు పైన స్వల్ప చర్చ జరిగింది. ఆ సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసారంటూ ముఖ్యమంత్రికి ఫిర్యాదు అందింది. దీంతో..అప్పటికే ఆయన బీజేపీకి దగ్గరవ్వటం పైన కొంత అసహనంతో ఉన్న ముఖ్యమంత్రి.. స్పష్టమైన సూచనలు చేసారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకించినా చర్యలు తప్పవని స్పష్టం చేసారు. సంబంధిత ఎంపీకి క్లాస్ తీసుకోవాల్సిందిగా ఉభయ గోదావరి జిల్లాల పార్టీ ఇన్ఛార్జి వై.వి.సుబ్బారెడ్డికి ఆదేశించారు. దీంతో..వెంటనే రఘురామ రాజు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. తాను ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని వివరించారు. అయితే, తాను బీజేపీకి దగ్గరవుతున్నానంటూ సొంత పార్టీలో జరుగుతున్న ప్రచారం పైన రఘురామ రాజు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
సీఎం మాత్రం కఠిన వైఖరితోనే..
ముఖ్యమంత్రి జగన్ మాత్రం క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడితే ఎటువంటి చర్యలకైనా సిద్దమేనని స్పష్టమైన సంకేతాలిస్తున్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు వైవీ సుబ్బారెడ్డి వెంటనే తనకు సీఎం చెప్పిన విధంగా రఘురామ రాజుతో చర్చించినట్లు తెలుస్తోంది. టీడీపీ నుండి నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరటం ద్వారా.. టీడీపి ఇప్పుడు సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉంది. అయితే ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ ఎంపీ..మరో వైపు చూస్తున్నారనే ప్రచారాన్ని సైతం సీఎం సహించటం లేదు. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా వైసీపీ నుండి 10-12 మంది ఎంపీలు సర్దుకుంటున్నారని..వారిని సరి చేసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ధిక్కార స్వరంతో వ్యవహరించిన ఎప్పుడూ లేని విధంగా ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పైనే వేటు వేసిన ముఖ్యమంత్రి..రాజకీయంగా పార్టీ నుండి గెలిచిన పదవిలో ఉన్న వారు సైతం ధిక్కారం తీరుతో వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవంటూ స్పష్టమైన మెసేజ్ పంపినట్లు సమాచారం. ఇప్పుడు ఈ వ్యవహారంలో పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.