నేడు అంతర్వేదికి జగన్- కొత్త రథం ప్రారంభోత్సవం- లక్ష్మీనరసింహుడి కళ్యాణోత్సవ వేళ
ఏపీలో గతేడాది తీవ్ర కలకలం రేపిన అంతర్వేది ఆలయ రథం దగ్ధం ఘటన తర్వాత వైసీపీ సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయితే అప్పట్లో హామీ ఇచ్చిన విధంగా కొత్త రథాన్ని అతి తక్కువ సమయంలోనే నిర్మించి ఇవాళ ప్రారంభించేందుకు సిద్ధమైంది. సీఎం జగన్ ఇవాళ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథాన్ని ప్రారంభించనున్నారు. అసలే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్న తరుణంలో సీఎం జగన్ కళ్యాణోత్సవం, రథం ప్రారంభోత్సవానికి రానుండటం విశేషం.
సీఎం జగన్ మోహన్రెడ్డి ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది పర్యటనకు వస్తున్నారు. ఉదయం 10.40 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 11.20 గంటలకు అంతర్వేది ఫిషింగ్ హార్బర్ వద్ద హెలిప్యాడ్కు చేరుకుంటారు. 11.30 నుంచి 11.35 గంటలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకుంటారు. 11.35 నుంచి 11.45 గంటల వరకూ శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం, అర్చన, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాలను సీఎం నిర్వహిస్తారని అధికారులు తెలిపారు.
సీఎం జగన్ ఉదయం 11.45 నుంచి 11.50 గంటల వరకూ రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. 11.50 గంటలకు వేద పండితుల నుంచి ఆశీర్వచనం, శేషవస్త్రం, ప్రసాదం స్వీకరిస్తారు. 12 గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి రథాన్ని సందర్శించి ప్రారంభిస్తారు. 12.35 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి తాడేపల్లి వెళ్లనున్నారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సందర్శించారు. సీఎం టూర్ ఏర్పాట్లు సమీక్షించారు.