పడవ ప్రమాదం: 26కు చేరిన మృతుల సంఖ్య, మృతుల వివరాలివే..
తూర్పుగోదావరి: జిల్లాలోని దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 26కు చేరింది. మంగళవారం ఉదయం 14 మృతదేహాలను గాలింపు సిబ్బంది కనుగొన్నారు. దీంతో మొత్తం 26 మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పడవ ప్రమాదంపై జగన్ సీరియస్, బాధగా ఉందంటూ.. క్లియర్ కట్ ఆదేశాలు: మృతులకు 10లక్షల పరిహారం
ప్రమాద స్థలం కచ్చలూరు వద్ద 4 మృతదేహాలు, దేవీపట్నంలో 8, ధవళేశ్వరం వద్ద నాలుగు, పోలవరం, పట్టిసీమ, తాళ్లపూడిలో ఒక్కో మృతదేహాలను గాలింపు సిబ్బంది బయటికి తీశాయి. మిగిలిన మృతదేహాల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
మొత్తం లభ్యమైన 26 మృతదేహాల్లో 23 మృతదేహాలను అధికారులు గుర్తించారు. మిగిలిన మూడు మృతదేహాలను గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. ఏడు మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
మృతుల్లో గడ్డమీద సునీల్(జనగామ), బస్కి వెంకటయ్య(ఖాజీపేట, వరంగల్), పాశం తరుణ్ కుమార్ రెడ్డి(రామడుగు, నల్గొండ), వీరం సాయికుమార్(హైదరాబాద్), గొర్రె రాజేంద్రప్రసాద్(ఖాజీపేట), రేపకూరి విష్ణుకుమార్(నేలకొండ, ఖమ్మం), పాడి ధరణికుమార్(హయత్నగర్, రంగారెడ్డి), కుసాల పూర్ణ(గోపాలపురం, విశాఖ), మీసాల సుష్మిత(విశాఖపట్నం), దుర్గం సుబ్రహ్మణ్యం(తిరుపతి), మధుపాడ రమణబాబు(మహారాణిపేట, విశాఖ), మూలవెంకట సీతారామరాజు(బాజీ జంక్షన్-విశాఖపట్నం), అబ్దుల్ సలీం(కృష్ణా జిల్లా), బండ పుష్ప(విశాఖ), గన్నాబత్తుల బాపిరాజు(నరసాపురం, ప.గో)లు ఉన్నారు.
కాగా, ప్రమాదానికి గురైన బోటు 315 అడుగుల లోతులో ఉన్నట్లు గాలింపు సిబ్బంది గుర్తించారు. బోటు మునిగిన ప్రదేశంలో సుడిగుండాలు ఎక్కువగా ఉన్నందునే సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందిగా మారిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 21మంది ఆచూకీ లభించలేదని తెలిపారు.