లాంచీ వెలికితీతలో రెండో రోజూ ఫలించని ప్రయత్నాలు: ఇనుప తాళ్లతో లాగినా.. లంగర్లు వేసినా!
రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన పర్యాటక లాంచీ రాయల్ వశిష్ఠను వెలికి తీసే ప్రయత్నాలు రెండో రోజు కూడా ఫలించలేదు. లాంచీ వెలికితీత పనుల కాంట్రాక్టును పొందిన బాలాజీ మెరైన్స్ సంస్థకు చెందిన నిపుణులు నిరంతరాయంగా చేస్తోన్న ప్రయత్నాలు కొలిక్కి రావట్లేదు. రాయల్ వశిష్ఠ లాంచీ బురదలో కూరుకునిపోయి ఉండటం వల్ల తాము చేస్తోన్న ప్రయత్నాలు ఫలించట్లేదని బాలాజీ మెరైన్స్ సంస్థ నిపుణులు అంచనా వేస్తున్నారు. లాంచీని వెలికి తీయడానికి సరికొత్త ప్రయత్నాలను బుధవారం చేపడతామని అన్నారు.
లాంచీ వెలికితీతలో తొలి ప్రయత్నం విఫలం..ఇక ప్లాన్ బీ: 144 సెక్షన్ విధింపు
గోదావరిలో సుమారు 310 అడుగుల లోతుకు చేరుకున్న లాంచీ కోసం సోమ, మంగళవారాల్లో విస్తృతంగా గాాలించారు. ప్రమాదం చోటు చేసుకున్న ప్రదేశం నుంచి సుమారు అర కిలోమీటరు దిగువ వరకు ఇనుప తాళ్లకు లంగర్లను వేసి అన్వేషించారు. మంగళవారం ఉదయం లాంచీ ఆ లంగర్లకు తగిలింది. ఆ ఇనుప తాళ్లను ప్రొక్లెయిన్లకు కట్టి ఒడ్డుకు లాగడానికి ప్రయత్నించారు. లాగడం మొదలు పెట్టిన కొద్ది సేపటికే తాళ్లు తెగిపోయాయి. మందంగా ఉండే ఇనపు తాళ్లు సైతం తెగిపోవడం బాలాజీ మెరైన్స్ సిబ్బందికి ఆశ్చర్యానికి గురి చేసింది.
లాంచీ మొత్తం బురదలో కూరుకునిపోయి ఉంటుందని అనుమానించారు. దీనితో వారు తమ వ్యూహాన్ని మార్చారు. రాష్ట్ర పర్యాటక శాఖ సహాయాన్ని తీసుకున్నారు. ఇదివరకే నదిలో జార విడిచిన పంటుకు పర్యాటక శాఖకు చెందిన బోటును అనుసంధానించారు. సుమారు 600 మీటర్లకు పైగా పొడవైన మరో ఇనుప తాడుకు లంగరును కట్టారు. దాని సహాయంతో తెగిపోయిన ఇనుప తాడును బయటికి లాగడానికి ప్రయత్నించారు. సాధ్య పడలేదు. అంతకుముందు వదిలిన లంగరు మాత్రమే బయటికి వచ్చింది. ఇక లాభం లేదనుకుని కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు.
బుధవారం ఉదయం లాంచీ వెలికితీత పనులను ప్రారంభించారు. నదీ గర్భానికి చేరుకున్న లాంచీని బయటికి తీసుకుని రావడం తాము అనుకున్నంత తేలిక కాకపోవచ్చని బాలాజీ మెరైన్స్ సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. నదీ ప్రవాహం, బురద తమ ప్రయత్నాలకు అడ్డు పడుతున్నట్లు చెప్పారు. అయినప్పటికీ.. లాంచీని ఒడ్డుకు తీసుకొచ్చేంత వరకూ తమ ప్రయత్నాలు కొనసాగుతాయని, వెనుదిరిగే ప్రసక్తే లేదని అన్నారు. మూడు రోజుల్లో లాంచీని వెలికి తీస్తామని తొలుత అనుకున్నామని, వాస్తవ పరిస్థితులు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయని చెప్పారు. మరిన్ని రోజులు పట్టొచ్చని బాలాజీ మెరైన్స్ చీఫ్ ధర్మాడి సత్యం తెలిపారు.