గెలిపిస్తే 5 హామీలు నెరవేరుస్తా.. ఊబలంకలో ఓ అభ్యర్థి బాండ్ పేపర్.. వైరల్
మరికొన్ని గంటల్లో ఏపీ పంచాయతీ నాలుగో విడత ఎన్నిక జరగనున్నాయి. ఈ క్రమంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ప్రలోభాల పర్వానికి తెరలేపారు. ఇక తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంకలో అయితే బాండ్ పేపర్ తెరపైకి వచ్చింది. తనను గెలిపిస్తే అదీ చేస్తానంటూ అభ్యర్థి హడావిడి చేస్తున్నాడు.
ఊబలంకలో మూడవ వార్డు తరపున పోటీ చేస్తున్న పడాల రంగారెడ్డి తమ వర్గాన్ని గెలిపిస్తే 5 హామీలని బాండ్ పేపర్ రాశాడు. ఏడాదిపాటు కేబుల్ ప్రసారాలు, రేషన్, మినలర్ వాటర్ ఉచితం అని చెప్పారు. దీంతోపాటు బీపీ షుగర్ పరీక్షలు కూడా ఫ్రీ అని బంరప్ ఆఫర్ ఇచ్చారు. ప్రతిభ కనబర్చిన 10 మంది విద్యార్ధులకు రూ.10వేలు చొప్పున ఇస్తామని హామీనిచ్చారు. ఈ హామీలను రూ.20 బాండ్పై ముద్రించి నోటరీ చేయించాడు. 14 బాండ్లను 14 వార్డుల్లోని పెద్దలకు అందజేశారు.
ఇటు మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసి చనిపోయిన వారి స్థానంలో తిరిగి నామినేషన్లు వేసేందుకు రాజకీయ పార్టీలకు అవకాశం కల్పించారు. ఏడురోజుల లోపు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఈ నెల 28 మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ వేసేందుకు వెసులుబాటునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన 56 మంది మృతి చెందినట్టు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పేర్కొన్నారు. వారిలో వైసీపీ నుంచి 28, టీడీపీ నుంచి 17, బీజేపీ 5, సీపీఐ 3, కాంగ్రెస్ 2, జనసేన ఒక్కరు ఉన్నారు.