ఉలిక్కిపడిన కోనసీమ ... ఉప్పూడిలో గ్యాస్ బ్లో అవుట్ .. భయం గుప్పిట్లో సమీప గ్రామాలు
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం కాట్రేనికోన మండలం ఉప్పూడిలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవుతుంది. గాలి ఎటువీస్తే అటు వైపు గ్యాస్ మళ్లుతుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయం గుప్పెట్లో ఉన్నారు. భారీ శబ్దాలతో గ్యాస్ ఎగిసి పడుతుండటంతో పరిసర ప్రాంతాల్లో ఇళ్లను పోలీసులు ఖాళీ చేయించారు. అమలాపురం, ముమ్మిడివరం నుంచి ఫైరింజన్లు రప్పించి గ్యాస్ లీకేజీ ప్రాంతంలో గ్యాస్ ను అదుపు చేసే యత్నం చేస్తున్నారు.
ఉప్పూడి ఓఎన్జీసీ బావిలో గ్యాస్ లీక్
అసలు ఏం జరిగిందంటే కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఓఎన్జీసీ బావి వద్ద నుంచి ఒక్కసారిగా గ్యాస్ పెద్ద శబ్దంతో ఎగసిపడింది.అడవిపేట ఓఎన్జీసీ డ్రిల్ సైట్కు అనుబంధంగా ఉన్న ఉప్పూడి-1 బావిలో 2006 ముందు వరకూ ఓఎన్జీసీ సొంతంగా గ్యాస్ను వెలికితీసింది. తర్వాత బావిలో సహజ వాయువు నిక్షేపాలు తగ్గుముఖం పట్టడంతో బావిని మూసేసింది. 2006లో దీనికి వెల్ క్యాప్ వేసింది.
బావిలో గ్యాస్ నిల్వలను అంచనాకు మూత తెరిచేందుకు యత్నించిన సిబ్బంది
గతేడాది కోల్కతాకు చెందిన పీఎఫ్హెచ్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థతో గ్యాస్ వెలికితీత ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆ సంస్థ పర్యవేక్షణలోనే ఈ బావి నిర్వహణ సాగుతోంది. ఇక బావిలో గ్యాస్ నిల్వలను అంచనా వేసేందుకు మూత తెరిచేందుకు సంస్థ సిబ్బంది ప్రయత్నించారు. రిగ్ మరమత్తులు నిర్వహించే సమయంలో వాల్ వదిలివేయడంతో గ్యాస్ ఉవ్వెత్తున ఎగిసి పడింది.
ఇద్దరి ఆచూకీ గల్లంతు
ఆ ప్రయత్నంలోనే గ్యాస్ ఒక్కసారిగా పెద్ద ఎత్తున లీక్ అయ్యింది . దీంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న పీఎఫ్హెచ్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు గ్యాస్ను అదుపుచేసే యత్నం చేశారు.ఇంతలో వెల్ క్యాప్ నుంచి ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దానికి అతి దగ్గరగా ఉన్న ఇద్దరూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పుకున్నట్టు చెప్తున్నారు కానీ ఆ ఇద్దరి ఆచూకీ లభించలేదని స్థానికులంటున్నారు.
సమీప గ్రామాల ప్రజలను ఖాళీ చేయించిన పోలీసులు .. మైకులతో ప్రచారం
ఇక ఇప్పటికీ గ్యాస్ లీక్ కొనసాగుతూనే ఉంది . చిన్న నిప్పురవ్వ వెలువడినా పెను ప్రమాదం సంభవిస్తుందనే ఉద్దేశంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరూ స్టవ్ లు వెలిగించకుండా , ఫోన్లు వాడకుండా ప్రచారం చేశారు. . ఇక ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.ఉప్పూడి గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివెయ్యటమే కాదు దగ్గరలో ఉన్న సెల్ టవర్ సేవలు కూడా నిలిపివేశారు. సెల్ఫోన్లు కూడా ఉపయోగించవద్దని అమలాపురం అధికారులు హెచ్చరించారు.
రెండు పద్దతుల్లో గ్యాస్ అదుపు చేస్తున్నామన్న మంత్రులు
గ్యాస్ లీకేజీని అదుపు చేసేందుకు నరసాపురం, రాజమహేంద్రవరం, తాటిపాక, విశాఖపట్నం నుంచి ప్రత్యేక నిపుణుల బృందాలను రప్పిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.జిల్లాలో గ్యాస్ లీక్ ప్రాంతాన్ని మంత్రులు విశ్వరూప్, పిల్లి సుభాష్ చంద్రబోస్ పరిశీలించారు. రెండు పద్ధతుల్లో గ్యాస్ అదుపు చేస్తున్నామని ప్రజలు భయాందోళనకు గురి కావద్దన్నారు . నాలుగు వైపులా గొడుగు రూపంలో నీటిని స్ప్రే చేస్తూ, అలాగే గ్యాస్ లీకవుతున్న బావిలోకి మట్టిని పంపుతూ కంట్రోల్ చేస్తున్నామని చెప్పారు.