ప్రాజెక్ట్ నిర్మాణం అంటే కాపర్ డ్యాం , రెండు కాలవలు తవ్వటమా : టీడీపీ నేతలపై మంత్రి అనీల్ ఫైర్
తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో మంత్రి అనీల్ కుమార్ యాదవ్ రెండు రోజుల పర్యటన కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ పర్యటనలో పోలవరంలో ఇరిగేషన్ పనులను పరిశీలించనున్న మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ఆర్ అండ్ బీ పనులపై స్థానిక నేతలు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పోలవరం నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చెయ్యటానికి సీఎం జగన్ ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖా మంత్రి అనీల్ కుమార్ యాదవ్ పోలవరం పనులను పరిశీలిస్తున్నారు . ఇక ఇదే సమయంలో టీడీపీ నేతలపై అనీల్ కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు.
పోలవరం నిర్మాణంపై వేగం పెంచుతున్న ఏపీ ప్రభుత్వం .. నేడు మంత్రి అనీల్ పోలవరం పర్యటన
ఈ నేపధ్యంలో ఆయన ఐదేళ్ల టీడీపీ పాలనపై మండిపడ్డారు. టీడీపీ పాలనలో నిర్వాసిత కుటుంబాలకు చేసిందేమీ లేదని మంత్రి అనీల్ కుమార్ యాదవ్ గత పాలకులపై ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ 70 శాతం పూర్తి అయిందని చెప్పారని , ప్రాజెక్ట్ నిర్మాణం అంటే కాపర్ డామ్, రెండు కాల్వలు తవ్వడం కాదని ఆయన మండిపడ్డారు. ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు నిర్వాసిత కుటుంబాలను ఆదుకోవాలని అప్పుడు మాత్రమే ప్రాజెక్ట్ పూర్తయినట్లు అని మంత్రి అనీల్ కుమార్ యాదవ్ తెలిపారు.జులై చివరి నాటికి ఆర్ అండ్ ఆర్ కాలనీలు పూర్తి చేసి 15 వేల కుటుంబాలను తరలిస్తామని తెలిపారు.
సీఎం జగన్ వారిని ఆదుకోవటానికి రూ. 79కోట్లు ప్యాకేజ్ ప్రకటించారని , ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో నిర్వాసితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. పోలవరం నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినా టీడీపీ నేతలు పనిగట్టుకొని చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు . పోలవరం ప్రాజెక్ట్ నాడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి ప్రారంభిస్తే ఆయన తనయుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి పూర్తి చేస్తారని చెప్పారు. ఇక కాంటూరు ముంపు గ్రామాల ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలిస్తామని ఆయన పేర్కొన్నారు .