రెఫరెండం పెట్టు... బక్రీద్ కథతో జగన్కు రఘురామ చురకలు... ఆ ఒక్కడే ప్రభావితం చేస్తున్నాడంటూ...
మూడు రాజధానులపై ప్రజా రెఫరెండం నిర్వహించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో దాని ఇతివృత్తాన్ని మూడు రాజధానుల ఏర్పాటుకు ముడిపెట్టి జగన్పై విమర్శలు గుప్పించారు. త్యాగ నిరతిని పరీక్షించేందుకు అల్లా ఇబ్రహీం కలలో కనబడి కొడుకును బలి ఇవ్వమని కోరాడని గుర్తుచేశారు. కానీ జగన్కు ఎవరు కలలో కనబడి అమరావతి నుంచి విశాఖకు రాజధానిని తరలించమన్నారోనని ఎద్దేవా చేశారు. అమరావతి రైతులను బలిచ్చి జగన్ విశాఖకు రాజధానిని మారుస్తున్నారని విమర్శించారు.
అప్పట్లో జగన్ కమిట్మెంట్కి ఆశ్చర్యపోయా... కానీ...
అమరావతికి ఫౌండేషన్ స్టోన్ వేసిన సమయంలో సరైన ఆహ్వానం లేకనే రాలేదని చెప్పారు తప్పితే... అక్కడ రాజధానికి వ్యతిరేకమని జగన్ చెప్పలేదన్నారు. మేనిఫెస్టోలోనూ ఎక్కడా అమరావతిలో రాజధానిని వ్యతిరేకించలేదన్నారు. పైగా రాజధానికి 30వేల పైచిలుకు ఎకరాలు కావాలనే ఆయన సూచించారన్నారు. అంతేకాదు,చంద్రబాబుకు అమరావతిలో ఇల్లు ఉందా... నాకిక్కడ ఇల్లు ఉందని ప్రశ్నించినట్లు గుర్తుచేశారు. దాంతో జగన్ కమిట్మెంట్కు తాను కూడా ఆశ్చర్యపోయానని చెప్పారు. కానీ మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్.. ఆ మాట నిలబెట్టుకోలేదన్నారు.
ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చింది అందుకే...
అమరావతిలో శిలాఫలకం కార్యక్రమానికి జగన్ రాకపోతే అక్కడ రాజధానికి ఆయన వ్యతిరేకమని ప్రజలు భావించారన్నారు. కానీ ఆ తర్వాత తాడేపల్లిలోనే జగన్ ఇల్లు కట్టుకోవడంతో.. రాజధానికి ఆయన వ్యతిరేకం కాదని ప్రజలు గుడ్డిగా నమ్మారని అన్నారు. అందుకే జగన్కు ఎన్నికల్లో అద్వితీయ విజయం లభించిందన్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగిస్తారన్న ఉద్దేశంతోనే ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారని... కాదనుకుంటే రెఫరెండం పెట్టాలని డిమాండ్ చేశారు. మాజీ న్యాయమూర్తి లేదా మాజీ డీజీపీ లేదా మాజీ సీఎస్ నేత్రుత్వంలో రెఫరెండం ప్రక్రియ చేపట్టాలన్నారు. ఒకవేళ రెఫరెండంలో వైసీపీకి అనుకూలమైన తీర్పు వస్తే నిరభ్యంతరంగా ముందుకు వెళ్లవచ్చన్నారు.
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా...
కలలో కనిపించిందనో.. ఎవరో బంధువులు చెప్పారనో... రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించడం సరికాదని రఘురామ కృష్ణం రాజు ఎద్దేవా చేశారు. ప్రజాక్షేత్రంలో అభిప్రాయం తీసుకున్నాకే ముందుకెళ్లాలన్నారు. అసలు వైసీపీలోనే 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం పట్ల వ్యతిరేకతతో ఉన్నారని... సీక్రెట్ రెఫరెండం నిర్వహిస్తే వారంతా వ్యతిరేకంగా ఓటేస్తామంటున్నారని చెప్పారు. కాబట్టి బ్యాలెట్తో ఎమ్మెల్యేలకు కూడా రెఫరెండం నిర్వహించాలన్నారు. సౌతాఫ్రికాను ఆదర్శంగా తీసుకుని 3 రాజధానులు ఏర్పాటు చేయడం పులిని చూసి నక్క వాత పెట్టుకోవడమేనన్నారు. 1910లో నాలుగు వేర్వేరు ప్రావిన్సులు కలిసి సౌతాఫ్రికాగా రూపాంతారం చెందినప్పుడు... ఆయా ప్రావిన్సులకు చెందిన ప్రజల అభీష్టం మేరకు మూడు రాజధానులు ఏర్పాటు చేశారన్నారు. కానీ ఇప్పుడు వాళ్లే నెత్తి నోరు కొట్టుకుంటున్నారని చెప్పారు.
Recommended Video
ఆ ఒక్కడే ప్రభావితం చేస్తున్నాడు...
అమరావతిలో రాజధానిని కొనసాగిస్తే ఒక సామాజిక వర్గం బలపడుతుందేమోనని విశాఖకు తరలించడం సరైన చర్య కాదన్నారు.విభజన చట్టం, సెక్షన్- 6 ప్రకారం నియమించబడిన శివరామ కృష్ణన్ కమిటీని కాదని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం అమలు పరచడం తగదన్నారు. అఖిలపక్షం ఏర్పాటు చేయకుండా ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా మూడు రాజధానుల నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. పూర్వం రాచరికంలో రాజులను పొగిడేందుకు భట్రాజులు,సలహాలిచ్చేందుకు మంత్రులు,యుద్ద తంత్రాల కోసం సేనాధిపతులు ఉండేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ మూడు పాత్రలను ఒకే ఉన్నతాధికారి నిర్వహిస్తున్నారని... ప్రతీ సందర్భంలో ముఖ్యమంత్రి నిర్ణయాలను ఆ ఒక్కడే ప్రభావితం చేస్తున్నారని చెప్పారు. జగన్ మరో 30 ఏళ్ల పాలించాలి అనుకుంటే ప్రజలను బలిపశువులను చేయకుండా ప్రజారంజకంగా పాలించాలని హితవు పలికారు.