నాయి బ్రాహ్మణులను కించపరిచే వ్యాఖ్యలు... రాంగోపాల్ వర్మపై కేసు నమోదు...
తూర్పు గోదావరి జిల్లా రాజోలు పోలీస్ స్టేషన్లో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదైంది. ఓ టీవీ ఇంటర్వ్యూలో తమ కులాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ వర్మపై నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు.
రెండు రోజుల క్రితం ఏలూరులోని స్థానిక నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవర్ స్టార్ సినిమా విషయంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కు,ఆయనకు మధ్య తలెత్తిన వివాదంలో అనవసరంగా తమ కుల ప్రస్తావన తీసుకొచ్చారని మండిపడ్డారు. వర్మ తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవలి కాలంలో చాలామంది ప్రముఖులు తమ కులాన్ని కించపరచడం,ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం కామన్గా మారిపోయిందన్నారు.
ఇలా జరగకుండా ఉండాలంటే తమ కులాన్ని కించపరిచేవారిపై అట్రాసిటీ చట్టం పెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాంగోపాల్ వర్మ మరోసారి తమ కులాన్ని కించపరిస్తే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. తమ కులాన్నే కాదు... ఏ కులాన్ని కించపరవద్దని హితవు పలికారు.
కాగా,కరోనా పీరియడ్లో రాంగోపాల్ వర్మ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నసంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వ్యంగ్యాస్త్రంగా వదిలిన పవర్ స్టార్ సినిమాపై పవన్ ఫ్యాన్స్కు ఆయనకు మధ్య పెద్ద వివాదమే జరిగింది. వర్మకు కౌంటర్గా పవన్ ఫ్యాన్స్ పరాన్నజీవి సినిమాను విడుదల చేశారు. ఈ క్రమంలో పవన్ ఫ్యాన్స్ వర్మ కార్యాలయంపై కూడా దాడి చేశారు.