బోటులో 93 మంది: హర్షకుమార్, పరువు నష్టం దావా వేస్తానని మంత్రి అవంతి ఫైర్
బోటు ప్రమాద సంఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోటులో ప్రయాణికుల సంఖ్యపై ప్రభుత్వ అధికారులు తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రమాద సమయంలో మొత్తం 93మంది ప్రయాణికులు బోటులో ఉన్నారని హర్షకుమార్ తెలిపారు. మరోవైపు దేవీ పట్నం ఎస్సై వెళ్లవద్దని వారించినా, మంత్రి అవంతి శ్రీనివాస్ ఆదేశాలతోనే బోటు బయలుదేరిందని ఆయన ఆరోపించారు.
ఇక బోటు జాడ కూడ సోమవారమే తెలిసిందని చెప్పిన ఆయన ఉద్దేశ్యపూర్వకంగానే బోటును బయటకు తీయడం లేదని అన్నారు. ప్రమాద సంఘటనపై సీఎం జగన్ను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించిన ఆయన పర్యటక బోట్లలో అధికారులు, నాయకుల వాటాలు ఉన్నాయని అన్నారు. బోటు ప్రమాదంపై సీనియర్ అధికారిని నియమించి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
అయితే బోటు ప్రమాదన ఘటనపై హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. హర్షకుమార్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేస్తామని మంత్రి అవంతి హెచ్చరించారు. మరోవైపు హర్షకుమార్ వ్యాఖ్యలను తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ సైతం ఖండించారు. మంత్రి నుండి తనకు ఎలాంటీ ఫోన్ రాలేదని స్పష్టం చేశారు.