అరెస్టుకు రంగం సిద్ధం: హర్షకుమార్ కోసం పోలీసుల గాలింపు
తూర్పుగోదావరి: అమలాపురం మాజీ ఎంపీ, మాజీ మంత్రి హర్షకుమార్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. కోర్టు ఆవరణలో ఆక్రమణల తొలగింపునకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో హర్షకుమార్ను అరెస్ట్ చేసేందుకు రాజమండ్రిలోని ఆయన ఇంటికి వెళ్లారు పోలీసులు. అయితే, హర్షకుమార్ ఇంట్లో లేకపోవడంతో ఆయన కోసం వేచిచూస్తున్నారు. మరో పోలీసుల బృందం ఆయన కోసం గాలింపు చేపట్టింది. ఆచూకీ లభించగానే అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు.
అసమర్థ సీఎం రాజీనామా చేయాలంటూ..
కాగా, ఇటీవల హర్షకుమార్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తన జీవితంలో ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి లాంటి అసమర్థ సీఎంను చూడలేదని ధ్వజమెత్తారు. గోదావరి నదిలో కచ్చలూరు వద్ద జరిగిన ఘోర పడవ ప్రమాద ఘటనలో బోటును ఇంకా వెలికి తీయకపోవడంపై స్పందిస్తూ హర్షకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బోటును ఎందుకు బయటకు తీయట్లేదని, లోపాలు బయటపడతాయనే భయటపడుతున్నారని హర్షకుమార్ ఆరోపించారు. గోదావరిలో బోటు మునిగి పక్షం రోజులైనా ఇంత వరకు బయటకు తీయడం చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.
అంతేగాక, రెండున్నర నుండి 5 కిలోమీటర్ల లోతు వరకు రోబోట్లను పంపించే టెక్నాలజీ కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నప్పటికీ ఆ టెక్నాలజీని ఎందుకు ఉపయోగించలేదంటూ హర్షకుమార్ ప్రశ్నించారు. ఇప్పటికైనా బోట్ ను వెలికితీయాలని డిమాండ్ చేశారు.
బోటు వెలికితీసే అసలు విషయాలు బయటకు వస్తాయని ఆయన పేర్కొన్నారు. బోటులో 93 మంది ఉన్నట్టు పేర్కొన్న ఆయన మరోమారు వైసిపి సర్కార్ పై విమర్శల వర్షం కురిపించారు . బోటు ప్రమాద ఘటనపై మరోమారు ఆరోపణలు చేసిన హర్ష కుమార్ గోదావరి నదిలో మునిగిపోయిన బోటును బయటకు తీయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్టు కనిపిస్తోందని విమర్శించారు. తాజాగా హర్షకుమార్ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవడం చర్చనీయాంశంగా మారింది.