జగన్ లేటుగానైనా..: నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకంపై రఘురామ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి సొంత పార్టీ ప్రభుత్వంపై కీలక విమర్శలు చేశారు. అంతేగాక, ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తిరిగి నియమించడంపైనా ఆయన స్పందించారు. రమేష్ కుమార్ నియామకం శుభపరిణామమని అన్నారు.
ఏపీలో కరోనా విజృంభణ: మళ్లీ 10వేలకుపైగా కొత్త కేసులు, 68 మంది మృతి, జిల్లాల వారీగా..
జగన్ లేటుగానైనా...
న్యాయవ్యవస్థకు ఈ మధ్యకాలంలో ఇవ్వాల్సిన విలువ ఇవ్వలేకపోవడంతోనే చాలా పరిణామాలు తలెత్తాయని పరోక్షంగా వైసీపీ సర్కారుపై విమర్శలు చేశారు. నిమ్మగడ్డ విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేటుగానైనా స్పందించడం మంచి పరిణామమని అన్నారు. ఇక కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విధానాన్ని ఏపీ ప్రభుత్వం సరిగా అర్థం చేసుకోవాలని రఘురామకృష్ణరాజు సూచించారు. నూతన విద్యా విధానాన్ని వక్రీకరించినా సుప్రీంకోర్టు దాన్ని సరిదిద్దుతుందని, అప్పుడైనా కోర్టు మాట వినాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఏపీ సర్కారు నిర్ణయాల కారణంగా..
అంతేగాక, ఏపీ సర్కారు నిర్ణయాల కారణంగా డీజీపీ కూడా నాలుగు సార్లు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని రఘురామ చెప్పారు. న్యాయవ్యవస్థను ప్రభుత్వం గౌరవించాలని హితవు పలికారు. రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది చనిపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పేరున్న మద్యం బ్రాండ్స్ ఎక్కువగానే ఉన్నా.. రాష్ట్రంలో అవి ఎందుకు దొరకట్లేదని ప్రశ్నించిన ఆయన.. దీనిపై సీఎం జగన్ సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు.
Recommended Video
అమ్మ ఒడి డబ్బులు నాన్న ఒడికి.. తిరిగి మీకేనా?
అమ్మ ఒడి డబ్బులు నాన్న ఒడిలోకి వెళ్తుపోతున్నాయని.. అవి తిరిగి మీ దగ్గరికే వస్తున్నాయని సంతోషిస్తున్నారా? అని రఘురా నిలదీశారు. రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేయాలని రఘురామ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే బ్రాండ్ ఉన్న మద్యం లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కల్తీ మద్యం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. కాగా, ఇప్పటికే రఘురామ కృష్ణంరాజు పలు అంశాలపై సీఎం జగన్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆగస్టు 5న జరిగే రామ జన్మభూమి వేడుకకు జగన్ హాజరుకావాలంటూ సూచించారు. దేశంలోని అందరు సీఎంలకు ఆహ్వానం అందినట్లు విన్నానని చెప్పారు. భూమిపూజ మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని రఘురామ కోరారు.