బ్రేక్ ఫెయిలై కొండపై నుంచి పడిన పెళ్లి వ్యాన్- తూర్పుగోదావరిలో ఏడుగురు మృతి...
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాను కొండపై నుంచి కిందకు పడటంతో ఆరుగురు అక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా గోకవరం సమీపంలోని తంటికొండపై ఉన్న వెంకటేశ్వరస్వామి గుడిలో పెళ్లి చేసుకుని తిరిగి వస్తున్న ఓ పెళ్లి వ్యాను ఈ తెల్లవారు జామున మూడున్నర గంటల సమయంలో బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి కొండపై నుంచి కిందకు పడింది. దీంతో వ్యానులో ప్రయాణిస్తున్న వారంతా తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన సహాయ బృందాలు క్షతగాత్రులను రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే ఇందులో ఆరుగురు అక్కడే చనిపోయారు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. చనిపోయిన వారిలో యళ్ల శ్రీదేవి (35), యళ్ల నాగ శ్రీలక్ష్మి (10), కంబాల భాను (35), సింహాద్రి ప్రసాద్ (25), పచ్చకూరి నరసింహం (24),, చాగంటి హేమ శ్రీలత (12), సోమరౌతు గోపాలకృష్ణ (72) ఉన్నారు.
Recommended Video
ఘాట్ రోడ్డుపై వ్యాన్ ప్రయాణిస్తుండటం, ఒక్కసారిగా బ్రేక్ ఫెయిల్ కాగానే డ్రైవర్ వ్యాన్ను అదుపు చేయలేకపోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరగ్గానే స్ధానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఇందులో నలుగురి పరిస్దితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. డాక్టర్లు అత్యవసర వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో మొత్తం 22 మంది ప్రయాణిస్తున్నారు.