అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ: స్వాగతించిన స్వరూపానందేంద్ర స్వామి, సాహోసోపేత నిర్ణయం..
అంతర్వేది రథం దగ్ధమయిన ఘటనను హిందూ సంస్థలు ముక్తకంఠంతో ఖండించాయి. సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరాయి. ప్రతిపక్షాలు కూడా విచారణకు పట్టుబట్టడంతో ఏపీ ప్రభుత్వం స్పందించింది. సీబీఐ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ ఆదేశాలతో డీజీపీ గౌతమ్ సవాంగ్.. కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని హిందూ సంస్థలు, స్వాములు స్వాగతిస్తున్నారు.
Recommended Video
స్వాగతించిన స్వరూపానందేంద్ర..
అంతర్వేది ఘటనపై సీబీఐ చేత విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి స్వాగతించారు. హిందువుల మనోభావాలతో ముడిపడిన అంతర్వేది అంశంపై సీబీఐ విచారణ ఆదేశాలు జారీచేయడం సాహసోపేతమైన నిర్ణయమని చెప్పారు. దీంతో ఘటన వెనుక ఉన్న అసలు కుట్ర కోణం బయటపడే అవకాశం ఉందన్నారు.
తేలనున్న సూత్రధారులు..?
అంతర్వేది రథం దగ్ధం ఘటనకు సంబంధించి సూత్రధారులు ఎవరు అనే విషయాన్ని సీబీఐ నిగ్గు తేలుస్తుందని చెప్పారు. ఇదివరకు టీటీడీని కాగ్ పరిధిలోకి తీసుకురావాలని తీసుకున్న నిర్ణయాన్ని కూడా స్వరూపానందేంద్ర స్వామి ప్రస్తావించారు. దానిని తలదన్నేలా అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించారని పేర్కొన్నారు. ఇది హిందువులు హర్షించదగిన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. హిందూధర్మ పరిరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం అభినందనీయమని తెలిపారు.
అంతకుముందు శ్రీనివాసానంద సరస్వతి స్వామి..
అంతర్వేది ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామి నిన్న (గురువారం) డిమాండ్ చేశారు. ఆ వెంటనే రాత్రి సమయంలో సీబీఐ విచారణకు ప్రభుత్వం కోరింది. అంతర్వేదిలో రథం దగ్ధం కావడం చాలా బాధాకరమని స్వామి అన్నారు. ఆ రథాలు స్వామివారితో 62 ఏళ్ల అనుబంధం అని గుర్తుచేశారు. లక్షలాది మంది భక్తులు తరించే రథాన్ని.. దగ్ధం జరగడం ఆవేదనకు గురిచేస్తుందని తెలిపారు.
దగ్దం కావడంతో దుమారం
స్వామివారి కళ్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. అలాంటి రథం అనుమానాస్పద స్థితిలో దగ్ధమవడంపై రాజకీయ పార్టీల నేతలు, హిందూ సంఘాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. రథం దగ్ధం కుట్రపూరితంగానే ఉందని ఆరోపించాయి. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
పెల్లుబికిన నిరసనలు
అంతర్వేది ఘటనపై బీజేపీ, జనసేన పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టాయి. సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఘటనపై సీరియస్గా స్పందించిన సర్కారు.. సంబంధిత అధికారిని సస్పెండ్ చేసింది. కొత్త రథం నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.