శిరోముండనం బాధితుడు వరప్రసాద్ అదృశ్యం.. అవమానం అని చెప్పి వెళ్లాడంటోన్న తండ్రి..
శిరోముండనం కేసు బాధితుడు ఇండుగుమిల్లి ప్రసాద్ కనిపించడం లేదు. దీంతో తండ్రి గంగరాజు ఆందోళన చెందాడు. బుధవారం ఇంటికొచ్చి అన్నం తిని, టూ వీలర్ ఇంటి వద్దే పెట్టి వెళ్లిపోయాడని చెప్పారు. అతను కనిపించకపోవడంతో అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. అతను పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ కూడా కూడా ఫైల్ చేశాడని తెలుస్తోంది.
టీడీపీ వార్డు మెంబర్ల నామినేషన్ కార్యక్రమంలో వర ప్రసాద్ పాల్గొన్నారు. ఇంటికి వచ్చి అన్నం తింటూ తనకు జరిగిన, జరుగుతున్న అవమానాలు గుర్తుచేసుకున్నాడని తండ్రి గంగరాజు తెలిపారు. తర్వాత సెల్ఫోన్, మోటార్ సైకిల్ ఇంటి వద్దే వదిలివెళ్లిపోయాడని వివరించారు. ఈ మేరకు ఆయన భార్య కౌసల్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గతేడాది జూలై 18వ తేదీన మునికూడలి, కటావరం వద్ద ఇసుక రేపు వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రశ్నించిన వరప్రసాద్కు పోలీసు స్టేషన్లో ఎస్సై ఫిరోజ్ శిరోముండనం చేయించారు. ఈ విషయం అప్పట్లో దుమారం రేపింది. రాష్ట్రపతి కార్యాలయం వరకు విషయం చేరడంతో కలకలం రేపింది. సీబీఐ విచారణ కూడా జరుగుతోంది. తనకు శిరోముండనం చేయించిన వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ ఇదివరకు వరప్రసాద్ నిరసన దీక్ష కూడా చేపట్టారు. కానీ కేసు మాత్రం పురోగతి సాధించడం లేదు.
కేసు పురోగతి సాధించకపోవడంతో వరప్రసాద్ మనస్తాపంతో ఉన్నారు. తనకు న్యాయం జరగదని భావిస్తున్నారు. శిరోముండనం గురించి వేధిస్తున్నారని చెప్పి వాపోయేవాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. బుధవారం సాయంత్రం ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిపోయారు. అప్పటినుంచి ఆచూకీ కనిపించకపోవడంతో.. పోలీసులకు పిర్యాదు చేశారు. వరప్రసాద్ ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.