జషీత్ జాడేది..? కిడ్నాపై మూడురోజులవుతున్నా తెలియని ఆచూకీ...
Recommended Video
తూర్పుగోదావరి : ఇప్పటికే 40 గంటలు గడిచిపోయాయి. కానీ చిన్నారి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. దీంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురిచేస్తున్నారు. ఎవరు కిడ్నాప్ చేశారు ? ఎందుకు అపహరించారో తెలియడం లేదన్నారు. కిడ్నాపర్లు తమ డిమాండ్లు చేబితే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని చిన్నారి తండ్రి చెప్తున్నారు. తమ చిన్నారికి సంబంధించిన సమాచారం తెలియజేయాలని వేడుకుంటున్నారు.
కిడ్నాప్ కలకలం ..
తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం విజయలక్ష్మీనగర్లో సోమవారం రాత్రి జషిత్ కిడ్నాపయ్యాడు. ఇంటి వద్ద ఆడుకుంటుండగా దుండగులు ఎత్తుకెళ్లారు. ఎప్పుడూ ఇంటి వద్ద జషిత్ ఆడుకుంటారని .. ఎప్పటిలాగే సోమవారం కూడా ఆడుకుంటుండగా ఎత్తుకెళ్లారని పేర్కొన్నారు. ఇప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే కిడ్నాపర్ల నుంచి ఎలాంటి డిమాండ్లు రాకపోవడంతో వారు ఏం చేశారని భయపడుతున్నారు. జషిత్ కోసం ఏడు పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. చిన్నారి పేరెంట్స్ ఇద్దరు బ్యాంకు ఉద్యోగులే. తండ్రి యూనియన్ బ్యాక్ అసిస్టెంట్ మేనేజర్. వారికి ఎవరితో విభేదాలు ఉన్నాయా ? అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. త్వరలోనే కిడ్నాప్ కథ సుఖాంతం అవుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్ానరు.
కిడ్నాపర్లు ..?
ఈ నెల 3వ తేదీని జషిత్ ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ముఖానికి ముసుగులు వేసుకొని ఇంటికి వచ్చారు. ఇల్లు ఖాళీ ఉందా అని ఫోన్ నంబర్ తీసుకెళ్లారని స్థానికులు చెప్తారు. దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ లభించింది. ముఖానికి కర్చీప్ కట్టుకున్న ఒకరు అనుమానాస్పదంగా ఉన్నాడు. కుదిరితే అప్పుడే చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించేవాడని విజువల్లో కనిపిస్తోంది. వారే కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కిడ్నాపర్లు పక్కా ప్రణాళిక అనుసరించి అపహరించారని అర్థమవుతుంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ కేసును ఏలూరు రేంజ్ డీఐజీ, ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు జషిత్ తండ్రి పనిచేసిన శ్రీకాకుళం, ఇతర చోట కూడా తమ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు.
టెన్షన్ .. టెన్షన్
మూడురోజులవుతున్నా జషీత్ ఆచూకీ తెలియకపోవడంతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డ జాడ తెలిస్తే సమాచారం తెలుపాలని కోరుతున్నారు. కిడ్నాపర్లు తమ డిమాండ్లు తెలియజేయాలని .. తమకు తోచినంత ఇచ్చేందుకు సిద్దమని ప్రకటించారు. ఇటు పోలీసు బృందాలు కూడా జషీత్ జాడ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. మరోవైపు స్థానికులు, యువత కూడా పోలీసులకు సహకారం అందిస్తున్నారు.