East Godavari 2020: వింత జంతువు సంచారం నుంచి వరదలు కరోనా వరకు జిల్లా రౌండప్
2020 వ సంవత్సరం తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు చాలా జ్ఞాపకాలనే మిగిల్చింది. వింత జంతువు సంచారం, గ్యాస్ లీక్ ఘటనలు, కరోనా వైరస్, నివర్ తుఫాన్ ఇలా అనేక అంశాలు ప్రధానంగా నిలిచాయి. అయితే, ప్రజల్లో చర్చకు దారి తీసిన పలు ముఖ్యాంశాల గురించి తెలుసుకుందాం.
మే నెలలో ఓ వింత జంతువు జిల్లాలోని ఆలమూరు మండలం పెనికేరు గ్రామ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. రాత్రి వేళల్లో పొలాల్లో సంచరించి జంతువులను, పశువులను చంపేస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. అలా 30కి పైగా పశువులు చనిపోయాయి. దీంతో, రైతులు, అధికారులు వింత జంతువు ఆనవాళ్లు కనిపెట్టే ప్రయత్నం చేశారు. అలాగే, డిసెంబర్ 16వ తేదీన . పెనికేరు గ్రామంలో నీటి కుక్కను గుర్తించారు. అయితే, అది పశువులను తినదని అధికారులు తెలిపారు.
Recommended Video
2020 వ సంవత్సరంలోనూ తూర్పు గోదావరి జిల్లా ప్రజలను గ్యాస్ లీక్ ఘటనలు భయపెట్టాయి. నిత్యం ఏదో ఒక చోట ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకయ్యాయి. ఫిబ్రవరి 10వ తేదీన సకినేటిపల్లి మండలం కేశవదాసుపాళెంలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీకైంది. ఆగస్టులో జిల్లాలో కురిసిన ఎడతెరిపిలేని భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ఎగువ నుంచి వచ్చిన వరద నీరు లంక గ్రామాలను ముంచెత్తింది. ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అరటి తోటలు నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లోని రైతులు ఆర్థికంగా నష్టపోయారు.
మే 21వ తేదీన జిల్లాలోని కొనపాపపేట పరిధిలో ఓ పురాతన తాటాకు ఇళ్లు కూలిపోయే పరిస్థితికి వచ్చింది. దీంతో, ఇంట్లో సామాన్లను తరలించే వ్యక్తికి వెండి నాణేలు కనిపించాయి. వాటిని తీసుకుంటుండగా, ఆ ఇంటి గోడలు కూలిపోయాయి. ఆ సమయంలో నాణేలు ఇంటి నుంచి రాలిపడ్డాయి. మరికొన్ని ఆ ఇంటి శిథిలాల కింద దర్శనమిచ్చాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
జిల్లాలోని అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయంలో ఎప్పటిలాగే 2020 ఫిబ్రవరిలో చదువుల పండుగ మహోత్సవం నిర్వహించారు. దాతల సహాయంతో సమకూర్చిన లక్ష పెన్నులను స్వామి వారి పాదాల ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ పెన్నులతో పరీక్షలు రాస్తే, తప్పక విజయం లభిస్తుందని విద్యార్థుల ప్రగాఢ నమ్మకం.
ఏపీలో అత్యధిక కరోనా కేసులు తూర్పు గోదావరి జిల్లాలో నమోదయ్యాయి. లక్షా 23 వేల మార్క్ను దాటాయి. వీరిలో లక్షా 21వేల 800 మందికి పైగా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 636 మందికి పైగా మృతి చెందారు. అధికారులు తీసుకున్న నివారణ చర్యలతో వైరస్ తీవ్రత అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.