మొన్నటికి మొన్నే కంపర రమేష్ దారుణహత్య: మరో వైసీపీ నేతపై కత్తులతో దాడి: కారం చల్లి
కాకినాడ: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై గుర్తు తెలియని వ్యక్తుల దాడులకు అడ్డుకట్ట పడట్లేదు. కొద్దిరోజుల కిందటే తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో కార్పొరేటర్ కంపర రమేష్ను గుర్తు తెలియని వ్యక్తులు కారుతో తొక్కించి మరీ.. దారుణంగా హతమార్చారు. ఈ ఘటనను విస్మరించకముందే- మరో వైఎస్సార్సీపీ నేతపై దాడి చోటు చేసుకుంది. ఈ దాడి కూడా తూర్పు గోదావరి జిల్లాలోనే చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులుపై వైసీపీ నాయకుడిపై కత్తులో దాడి చేశారు.
కళ్లల్లో కారం చల్లి కత్తులతో పొడిచారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్నారు. ఆయన పేరు దొండపాటి శ్రీను. తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరంలో ఈ మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ శ్రీలత సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితులను సమీక్షించారు. ఈ ఘటన పట్ల వైసీపీ నేతల్లో ఆగ్రహావేశాాలు వ్యక్తమౌతోన్నాయి. ధవళేశ్వరంలో నిర్మాణంలో ఓన్న భవనంలో దొండపాటి శ్రీనుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు.
తొలుత ఆయనతో వాగ్వివాదానికి దిగారని, ఆయన తప్పించుకుని పారిపోకుండా కంట్లో కారం చల్లి, కత్తులతో దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ దాడిలో మొత్తం నలుగురు దుండగులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్థానికులపైనా దుండగులు దాడి చేశారు. ఒకరిద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. రక్తపుమడుగులో పడి ఉన్న దొండపాటి శ్రీనును స్థానికులు హుటాహుటిన రాజమహేంద్రవరంలోని ఆసుపత్రికి తరలించారు.
అక్కడ ఆయనకు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దొండపాటి శ్రీనుపై దాడి చేయడానికి గల కారణాలేమిటనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు. చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన గొడవలే ఈ దాడికి కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి.