వైసీపీ సీనియర్ నేత దారుణ హత్య: ఉద్రిక్తంగా: నిందితుల కోసం గాలింపు
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కార్పొరేటర్ కంపర రమేష్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను హత్య చేశారు. కాకినాడలోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధారాత్రి దాటిన తరువాత రెండున్నర గంటల సమయంలో ఈ ఘటన చోటు చేేసుకున్నట్లుగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనతో కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కంపర రమేష్.. తొమ్మిదో వార్డు కార్పొరేటర్. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయీ సంఘం ఛైర్మన్గా పనిచేశారు. ఇదివరకు ఆయన సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 1992లో ఎన్ఎస్యూఐ కాకినాడ నగర అధ్యక్షుడిగా, 1995లో తూర్పు గోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా పని చేశారు. 2000లో కాకినాడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా కొనసాగారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. వైసీపీలో చేరారు. వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువాను కప్పుకొన్నారు.
అర్ధరాత్రి ఆయన ఇంటికి వెళ్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. కారుతో ఢీకొట్టి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆర్డీవో కార్యాలయానికి వెళ్లే మార్గంలో కార్ షెడ్ సమీపంలో ఆయన మృతదేహం రక్తపు మడుగులో పడి ఉన్న స్థితిలో కనిపించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హుటాహుటిన రమేష్ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.