తనపై భౌతిక దాడి చేసిన ఎస్సైని ఆలింగనం చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా రాజానగరానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా.. ఓ ఎస్ఐని ఆలింగనం చేసుకున్న ఉదంతం చర్చనీయాంశమైంది. ఆయన మరెవరో కాదు.. సరిగ్గా రెండేళ్ల కిందట ఇదే అక్టోబర్ నెలలో జక్కంపూడి రాజాపై బహిరంగంగా భౌతిక దాడికి దిగిన రామచంద్రపురం ఎస్ఐ నాగరాజు కావడంతో దీనికి ఇంత ప్రాధాన్యత లభించింది. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న జక్కంపూడి రాజాను 2017 అక్టోబర్ లో ఎస్ఐ దాడి చేశారు. ఆయనపై లాఠీ ఛార్జీ చేశారు. ఈ ఉదంతం అప్పట్లో జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
మీ బావమరిది బాలకృష్ణ ప్రధానిని తిట్టినప్పుడు నోరెత్తలేదే?: చంద్రబాబుపై బీజేపీ నేత ఫైర్
జక్కంపూడి రాజాపై నాగరాజు దాడి చేసిన ఘటన రాజకీయ రంగును పులుముకొంది. వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకులు సైతం దీనిపై స్పందించారు. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని అంటూ దుయ్యబట్టారు. తమ పార్టీ నాయకుడు జక్కంపూడి రాజాను బహిరంగంగా దాడి చేయడం అమానుషమంటూ వైఎస్సార్సీపీ నాయకులు జిల్లా వ్యాప్తంగా బంద్ కు సైతం పిలుపునిచ్చారు. నాగరాజును సస్పెండ్ చేయాలంటూ వారు అప్పట్లో పట్టుబట్టారు.
ఆ తరువాత ఆ విషయం సద్దు మణిగింది. సరిగ్గా రెండేళ్ల తరువాత.. అదే అక్టోబర్ నెలలో ఎస్ఐ నాగరాజు.. జక్కంపూడి రాజాను మర్యాదపూరకంగా కలుసుకున్నారు. నాటి సంఘటనను గుర్తు చేశారు. విధి నిర్వహణలో భాగంగా తాను అలా ప్రవర్తించాల్సి వచ్చిందని, క్షమించమని కోరారు.
దీనికి బదులుగా- జక్కంపూడి రాజా ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఆ విషయాన్ని తాను ఎప్పుడో మరిచిపోయానని అన్నారు. భుజంపై చేతులు వేసి, విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించారని అభినందించారు. భవిష్యత్తులో పోలీసు శాఖలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని అకాంక్షించారు.