మళ్లీ వార్తల్లోకి రఘురామ: రామమందిరం నిర్మాణానికి భారీ విరాళం: మోడీ వల్లే సాకారం: ఉడతాభక్తి
అమరావతి: రాజకీయంగా కొద్దిరోజులుగా రాష్ట్రంలో బాగా వివాదాల్లో నానుతోన్న పేరు రఘురామ కృష్ణంరాజు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు లేవనెత్తిన ఆయన ప్రస్తుతం అనర్హత వేటును ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ప్రభుత్వ పనితీరుపై వరుసబెట్టి విమర్శలను గుప్పిస్తూ వస్తోన్న తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. కోట్లాదిమంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న అత్యంత కీలకమైన రామమందిర నిర్మాణానికి రఘురామ భారీ విరాళాన్ని ప్రకటించారు.
Recommended Video
నన్నేమీ చేయలేక..అలా కక్ష సాధించారు..వెలేశారు: వైసీపీపై రఘురామ నిప్పులు: టార్గెట్ సాయిరెడ్డి
ఉత్తర ప్రదేశ్ అయోధ్యలోని రామజన్మభూమిలో వచ్చేనెల 5వ తేదీన రామమందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతోన్న విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూమిపూజ చేయబోతున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ప్రత్యేకంగా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ కమిటీ సారథ్యంలోనే రామమందిరం నిర్మాణ పనులు ఆరంభం కానున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ఆలయ నిర్మాణం కోసం పలువురు దాతల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. కొన్ని దిగ్గజ సంస్థలు భారీగా విరాళాలను ప్రకటించారు. కొన్ని ముస్లిం సంస్థలు బంగారు ఇటుకలను అందజేయనున్నారు. తాజాగా- రఘురామ కృష్ణంరాజు కూడా విరాళాన్ని ప్రకటించారు. లోక్సభ సభ్యుడిగా తనకు అందుతోన్న మూడు నెలల వేతనాన్ని ఆయన విరాళంగా ప్రకటించారు. 3,96,000 రూపాయల మొత్తంతో కూడిన చెక్ను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి అందజేశారు.
దీనికోసం ఆయన శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ఛైర్మన్ లేఖ రాశారు. 3,96,000 రూపాయలతో కూడిన చెక్కును ఆయన దాని జత చేశారు. ఉడుతా భక్తిగా తాను ఈ సాయాన్ని అందజేస్తున్నట్లు రఘురామ పేర్కొన్నారు. కోట్లాదిమంది హిందువుల చిరకాల కోరిక నెరవేరబోతున్నందుకు ఆనందంగా ఉందని ఆయన అన్నారు. రామమందిరం నిర్మాణం పూర్తి కావాలని కోరుకుంటోన్న శ్రీరామచంద్రుడి భక్తుల్లో తానూ ఒకడినని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా రామ మందిరం నిర్మాణానికి భూమిపూజ చేయబోతుండటం హర్షణీయమని అన్నారు. ఆయన సంకల్పించడం వల్లే ఈ కల సాకారమౌతోందని ఆయన వ్యాఖ్యానించారు. శరవేగంగా నిర్మాణం పూర్తవుతుందని తాను ఆశిస్తున్నట్లు రఘురామ చెప్పారు. ప్రతి హిందువు ఈ ఆలయాన్ని సందర్శించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా అయోధ్య హిందువుల ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని అన్నారు.