జగన్ కు రఘురామ కొత్త ఆఫర్- ఒప్పుకుంటే 10 రోజుల్లో జనంలోకి - వైసీపీలోనే ఉంటానంటూ..
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై రోజుకో రకంగా తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ పార్టీ అధినేత జగన్ ముందు మరో ఆఫర్ పెట్టారు. తన ఆఫర్ కు ఒప్పుకుంటే పది రోజుల్లో జనంలోకి వస్తానంటూ షరతులు కూడా విధించారు. తానెక్కడీ వెళ్లలేదని, వైసీపీలోనే ఉన్నానంటూ గుర్తు చేశారు. తద్వారా తనను గుర్తించాలంటూ సినిమా స్టైల్లో రఘురామరాజు జగన్ ముందు ప్రతిపాదన పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇన్నాళ్లూ రోజుకో రకంగా విమర్శలు గుప్పిస్తూ తాజాగా కొత్త ప్రతిపాదన పెట్టడం కూడా చర్చనీయాంశంగా మారింది.
దూకుడు పెంచిన రఘురామ- మౌనంగా వైసీపీ- కారణాలివేనా ?
జగన్ కు రఘురామ ఆఫర్...
గతంలో ఓసారి బొచ్చులో నాయకత్వం అంటూ ఏకంగా వైసీపీ అధినేత కమ్ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలకు దిగిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. తాజాగా ప్రతీ రోజూ ఏదో ఒక అంశాన్ని తీసుకుని ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రఘురామ చేస్తున్న విమర్శలు వైసీపీని తాకుతున్నాయో లేదో కాస్త పక్కనబెడితే ఆయన మాత్రం తన విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన ఒక్కసారిగా వైసీపీకి విధేయుడిగా మారిపోయారు. తాను వైసీపీలోనే ఉన్నాను, ఎక్కడికీ వెళ్లలేదంటూ అధిష్టానానికి గుర్తుచేశారు. అయితే తన వెంట చిన్నా చితకా నాయకుడు కూడా లేడని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. చివరిగా అధినేత జగన్ కు ఓ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చేశారు.
సెక్యూరిటీ ఇస్తే పది రోజుల్లో...
ప్రస్తుతం ఏపీలో భద్రత లేనందువల్ల ఢిల్లీలోనే ఉంటున్నట్లు పరోక్షంగా అంగీకరించిన రఘురామకృష్ణంరాజు... తనకు సీఎం జగన్ భద్రత కల్పిస్తానంటే సొంత నియోజకవర్గం నరసాపురంలో పర్యటిస్తానని జగన్ కు ఆఫర్ ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటివరకూ తనకు సెక్యూరిటీ ఇవ్వలేదని, ఆయన సాధారణ మానవులతో మాట్లాడరని వ్యంగ్యాస్త్రాలూ కూడా సంధించారు. తనతో మాట్లాడటానికి పార్టీ నేతలు కూడా భయపడుతున్నారని రఘురామ తెలిపారు. అందుకే తాను సెక్యూరిటీ కోరుతున్నట్లు రఘురామ చెప్పుకొచ్చారు. సెక్యూరిటీ ఇస్తే మాత్రం కరోనాతో ఇబ్బందులు పడుతున్న జనం కోసం నరసాపురంలో పర్యటిస్తానన్నారు.
నా మాటలు వక్రీకరించారు.
సీఎం జగన్ పై తన మాటలు కొందరు వక్రీకరించారని రఘురామరాజు చెప్పుకొచ్చారు. తన గెలుపులో 90 శాతం జగన్ ఉంటే తన సొంతంగా 10 శాతం వల్ల గెలిచానని తాజాగా వెల్లడించారు. పార్టీ ప్రచారంలో అధినేత బొమ్మనే పెట్టుకుంటారని, మానేయ్యమంటే మానేస్తాం కదా అని తిరిగి జగన్ మీదే సెటైర్లు వేశారు. ఎక్కడైనా అధ్యక్షుడి బొమ్మ పెట్టుకుంటాం కానీ చంద్రబాబు, మాయావతి బొమ్మలు పెట్టుకోం కదా అంటూ రఘురామ తిరిగి తన వాదనను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. అయినా పదే పదే ఈ బొమ్మల గోల తీసుకురావద్దని మీడియాకు ఆయన విజ్ఞప్తి చేశారు.
Recommended Video
పీవీ శత జయంతి డిమాండ్..
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం తరహాలో ఏపీ సర్కారు కూడా నిర్వహించాలని మరో డిమాండ్ ను రఘురామ వైసీపీ ప్రభుత్వం ముందు ఉంచారు. తెలంగాణలో పుట్టినా నంద్యాల నుంచి ఆయన గతంలో ఓసారి గెలిచారని రఘురామ గుర్తుచేశారు. గొప్ప రాజనీతిజ్ఞుడిని గౌరవించుకుందామని, ఆయనకు భారతరత్న వచ్చేలా సిఫార్సు చేయాలని జగన్ ను ఆయన కోరారు. ప్రభుత్వం తరఫున సిఫార్సు చేస్తే ఎంపీలంతా కలిసి ఇందుకోసం పార్లమెంటులో ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో సమస్యలపైనే వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన రఘురామ.. తాజాగా పీవీ గురించి ప్రస్తావించడం చూస్తుంటే ఈసారి మరో వివాదంలోకి ప్రభుత్వాన్ని లాగే ప్రయత్నం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.