జేపీ నడ్డాతో రఘురామ భేటీ: ఏపీలో పాలనపై విమర్శలు ..జపింగ్ ఖాయమైందా..?
ఢిల్లీ: గత కొద్ది రోజులుగా అధికారిక వైసీపీకి కొరకరాని కొయ్యగా మారారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు. ఇప్పటికే ఆయనపై లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు పార్టీ సభ్యులు ఎంపీలు ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ అతనిపై అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ ఇచ్చారు. అయితే ప్రస్తుతానికి అది పెండింగ్లో ఉండగా రఘురామకృష్ణం రాజు కూడా అదే స్థాయిలో వైసీపీ నేతలపై మండిపడ్డారు. గత కొద్దిరోజులుగా సీఎం జగన్ను టార్గెట్ చేస్తూ పార్టీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ కంటిలో నలుసులా మారారు. తాజాగా రఘురామకృష్ణం రాజు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కనిపించారు. దీంతో రఘురామకృష్ణం రాజు ఇక పార్టీ మారేందుకు సిద్ధమయ్యారంటూ వార్తలు వస్తున్నాయి.
Recommended Video
బీజేపీ కేంద్ర కార్యాలయంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ఒక్కసారిగా ప్రత్యక్షమవడంతో తెలుగుమీడియా ఆయనపై ఫోకస్ చేసింది. ఇప్పటికే పార్టీ మారి కమలం గూటికి చేరుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజు బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యక్షమవడం అక్కడ బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కావడంతో ఆ వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. బీజేపీ కార్యాలయంకు ఎందుకొచ్చారని ప్రశ్నించగా... ఇందులో రాజకీయం ఏమీ లేదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మెన్ హోదాలో నడ్డాను కలిసి సలహాలు తీసుకునేందుకు మాత్రమే వచ్చినట్లు రఘురామ చెప్పారు. అయితే అలాంటి సలహాలు తీసుకునేందుకు పార్టీ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఏముందనే చర్చ జరుగుతోంది.
ఇక పార్టీ మార్పుపై వస్తున్న వార్తల గురించి ప్రశ్నించగా అలాంటి యోచన ఏమీ లేదని చెప్పిన రఘురామ కృష్ణం రాజు... తాను డిబేట్లో పాల్గొనే అవకాశం వైసీపీ ఇవ్వకపోవచ్చకానీ... కొన్ని సార్లు తానే రిక్వెస్ట్ చేసి అడిగి తెచ్చుకుంటానని వెల్లడించారు. పార్టీ నుంచి తనను బయటకు పంపే ప్రయత్నాలు బలంగా జరుగుతున్నాయని వ్యాఖ్యానించిన రఘురామ కృష్ణంరాజు.. అంత సులభంగా పార్టీని వీడబోనని స్పష్టం చేశారు. ఇక లోక్సభలో తాను ఎక్కడ కూర్చోవాలో తమ పార్టీ నేతలు డిసైడ్ చేస్తారని చెప్పిన రఘురామ... తాను ముందు కూర్చోవడం ఇష్టం లేదేమో అందుకే వెనక్కు మార్చి ఉంటారని చెప్పారు. అయితే సీటుదేముంది సింహం ఎక్కడ కూర్చుంటే అక్కడే సింహాసనం అని తన మిత్రులు కొందరు తనతో చెప్పినట్లు రఘురామ కృష్ణం రాజు చెప్పారు.