చింతమనేనిపై మరో కేసు నమోదు.. ఈసారి పోలీసులవంతు
ఏపీలో టీడీపీ నేతల మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకేసుల నేపధ్యంలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న చింతమనేనిపై మరో కేసు నమోదైంది. ఈ సారి కేసు పెట్టటం పోలీసుల వంతయ్యింది. 67 రోజులు జైలు జీవితాన్ని అనుభవించిన తరువాత తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బెయిల్ పై విడుదలయ్యారు. బెయిల్ పై చింతమనేని విడుదలై రెండురోజులు కూడా కాకముందే మరోమారు ఆయనపై కేసు నమోదైంది. ఈసారి చింతమనేనిపై పోలీసులు విధులకు అవరోధం కలిగించారంటూ, మోటార్ వెహికిల్ చట్టాన్ని ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు.
చింతమనేనిపై 50 కేసులు .. గాలిస్తున్న 12 బృందాలు ..పోలీసులపై వేటు
నిబంధనలను ఉల్లంఘించి, పోలీసు విధులకు ఆటంకం కల్పించారనే అభియోగాలతో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో పాటు ఆయన అనుచరులు మరికొందరిపై ఏలూరుత్రీటౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. 18 కేసుల్లో బెయిల్ పొంది ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం విడుదలైన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బయటకు వచ్చిన సందర్భంగా ర్యాలీ నిర్వహించాలని భావించారు ఆయన అనుచరులు. అయితే ఏలూరు సబ్ జైలు నుంచి ర్యాలీగా దుగ్గిరాలలో ఉన్న ఇంటికి చేరుకున్న ఆయన జిల్లాలో పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉన్నా పట్టించుకోకుండా వ్యవహరించారని పోలీసులు కేసు నమోదు చేశారు.
త్రీ టౌన్ సీఐ ఎంఆర్ఎల్ ఎస్ఎస్ మూర్తి తన సిబ్బందితో శనివారపు పేటలో గస్తీ నిర్వహిస్తున్న క్రమంలో చింతమనేని ప్రభాకర్ ర్యాలీగా పోలీసుల విధులకు ఇబ్బంది కలిగించారని తెలుస్తుంది. చింతమనేని తన ర్యాలీతో ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని , ఆ సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కల్పించారని పోలీసు మోటారు వాహన చట్టాన్ని కూడా ఉల్లంగించారనే అభియోగాలతో ఏలూరు త్రీటౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. చింతమనేనితో పాటు ఆయన అనుచరులైన రవి, చలమోల అశోక్గౌడ్, తదితరులపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు .