ఏలూరులో సీఎం జగన్ పర్యటన .. తమ్మిలేరు రిటైనింగ్ వాల్ కు శంకుస్థాపన
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పర్యటించారు. 330 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. పదే పది నిమిషాల్లో ఏలూరులో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన పూర్తయింది. ఈ పర్యటనలో భాగంగా తమ్మిలేరు రిటైనింగ్ వాల్ కు సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఏపీలో మూడు మెగా పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ .. ఎస్ఐపీబీ సమీక్షలో సీఎం జగన్ నిర్ణయం
ఈరోజు ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుండి 10 గంటలకు ఏలూరు కు బయల్దేరిన సీఎం 10 .43 నిమిషాలకు ఏలూరు కి చేరుకున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. కరోనావ్యాప్తి నేపథ్యంలో ఈ పర్యటనకు చాలా తక్కువ మందిని అనుమతించారు.తమ్మిలేరు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
ఆ తర్వాత ఏలూరు నగరంలో ఎస్ఎంఆర్ పెదబాబు, నూర్జహాన్ ల కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం అక్కడి నుండి నేరుగా తాడేపల్లికి తిరుగు ప్రయాణమయ్యారు.
ఈ పర్యటనలో జగన్ వెంట డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి తానేటి వనిత, రంగనాధరాజు, ఎంపీలు కోటగిరి శ్రీధర్ మార్గాని భరత్, ఎమ్మెల్యే లు అబ్బాయి చౌదరి, గ్రంధి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ ఆళ్ల నాని మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏలూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా స్పందిస్తున్నారని పేర్కొన్నారు. ఏలూరులో 330 కోట్లతో చేపట్టే వివిధ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపనలు చేశారని చెప్పారు.