అంతుచిక్కని వ్యాధి... ఏలూరు బాధితులకు సీఎం జగన్ పరామర్శ... అండగా ఉంటామని భరోసా..
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ఆస్పత్రిలో చేరిన బాధితులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. సోమవారం(డిసెంబర్ 7) ఉదయం 10.30గంటలకు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న ఆయన... బాధితులు చికిత్స పొందుతున్న వార్డుకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులతో స్వయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
Recommended Video
ఈ క్రమంలో ఆస్పత్రి బెడ్పై ఉన్న ఓ బాలుడిని సీఎం జగన్ పరామర్శించగా... అతను రెండు చేతులెత్తి నమస్కరించే ప్రయత్నం చేశాడు. దీంతో బాలుడిని వారించిన జగన్ అతని నదుటిపై ముద్దు పెట్టాడు. బాధితులంతా ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం అండగా ఉ:టుందని జగన్ వారికి భరోసానిచ్చారు. బాధితులను పరామర్శించిన అనంతరం జగన్ వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితులెవరికీ ఇన్ఫెక్షన్,జ్వరం లేదని వైద్యులు జగన్కు వెల్లడించారు.
ఏలూరులో నెలకొన్న ఈ పరిస్థితిపై సీఎం జగన్ జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం దేవరపల్లిలో గోపాలపురం ఎమ్మెల్యే తల్లారి వెంకట్రావు కుమార్తె వివాహ రిసెప్షన్కు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు.
కాగా,ఇప్పటివరకూ ఏలూరులో 345 మంది బాధితులు ఆస్పత్రిలో చేరారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 28 మంది బాధితులు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. బాధితుల్లో 180 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు వైద్యులు వెల్లడించారు. శనివారం ఏలూరు పట్టణంలోని పడమరవీధి,తాపీమేస్త్రీ కాలనీ,శనివారం పేట,ఆదివారం పేట,కొత్తపేట,అరుంధతీ పేట స్థానికులు అస్వస్థతకు గురవగా... ఆదివారం మరికొన్ని కాలనీలకు ఈ వ్యాధి విస్తరించింది.
ఇందిరమ్మ కాలనీ,మరడాని రంగారావు కాలనీ,వైఎస్ఆర్ కాలనీలకు చెందిన స్థానికులు ఆదివారం అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. దెందులూరు పరిధిలోని కేదవరానికి చెందిన నలుగురు వ్యక్తులు కూడా వింత వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. అయితే స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందిన కొద్దిసేపటికే వారు కోలుకుని డిశ్చార్జి అయ్యారు.ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో ఎవరికి ప్రాణాపాయం లేదని అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
అంతుచిక్కని వ్యాధి... ఏలూరు బాధితులకు సీఎం జగన్ పరామర్శ... అండగా ఉంటామని భరోసా.. #AndhraPradesh #YSJagan #Eluru pic.twitter.com/NSk3FhpnIN
— oneindiatelugu (@oneindiatelugu) December 7, 2020
— oneindiatelugu (@oneindiatelugu) December 7, 2020