ఏలూరులో అదుపులోకి వచ్చిన వింతవ్యాధి- బాధితులకు డిప్యూటీ సీఎం ఆళ్లనాని పరామర్శ
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో దాదాపు 600 మందికి పైగా బాధితులుగా మారడానికి కారణమైన వింతవ్యాధి క్రమంగా అదుపులోకి వస్తోంది. ఇవాళ దాదాపు పది మంది రోగులు సాధారణ లక్షణాలతో వివిధ ఆస్పత్రులకు వెళ్లినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో వ్యాధి పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశముందని డాక్టర్లు చెబుతున్నారు.
ఏలూరులో వింతవ్యాధికి గురై ఆస్పత్రుల్లో చికిత్స తర్వాత ఇళ్లకు చేరుకున్న బాధితులను స్ధానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఇవాళ పరామర్శించారు. వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఏలూరులోని తంగెళ్లమూడి ప్రాంతంలో బాధితుల ఇళ్లకు వెళ్లిన ఆళ్లనాని ఆస్పత్రుల నుంచి ఇళ్లకు చేరుకున్న తర్వాత పరిస్ధితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. మరోసారి ఎలాంటి లక్షణాలు కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలని నాని వారికి సూచించారు.
ఏలూరులో సేకరించిన నీరు, పాలు, కూరగాయల శాంపిల్స్తో పాటు రోగుల శరీరాల్లో రక్తం, మూత్రం, ఇతర శాంపిల్స్ కూడా వివిధ పరీక్షా కేంద్రాల్లో పరీక్షిస్తున్నారని, వాటి ఫలితాలు రాగానే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆళ్లనాని బాధితులకు తెలిపారు. ఇప్పటికే గుర్తించిన శాంపిల్స్ ఫలితాల ఆధారంగా అధికారులకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు ఆళ్లనాని వెల్లడించారు. నిన్న వివిధ ప్రయోగశాలల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సీఎం జగన్.. తదుపరి పరీక్షలు కొనసాగించాలని, ఎలాంటి ఫలితాలను తక్కువ అంచనా వేయొద్దని కోరారు.