ఏలూరుకు చేరుకున్న డబ్ల్యూహెచ్ఓ నుంచి ఇద్దరు ప్రతినిధులు, వైద్యులు, శాస్త్రవేత్తల బృందాలు
ఏలూరులో అంతుచిక్కని వింత వ్యాధి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. ఇప్పటికే వందల సంఖ్యలో ప్రజలు ఈ వ్యాధి బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే ఒకరు మృతి చెందగా, 19 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం వారిని గుంటూరు, విజయవాడ ఆస్పత్రికి తరలించారు . ఈ క్రమంలో ఇక్కడ పరిస్థితులు పర్యవేక్షించడానికి, అసలు ఈ వ్యాధి ఏంటో తెలుసుకోవడానికి దేశంలోని అనేక ఇన్స్టిట్యూట్ ల నుండి వైద్య, శాస్త్రవేత్తల బృందాలు ఏలూరుకు చేరుకున్నాయని డిసిహెచ్ఎస్ ఏ వి ఆర్ మోహన్ తెలిపారు.
దేశంలోని కీలక మెడికల్ ఇన్స్టిట్యూట్ ల నుండి వైద్య బృందాలు
దేశంలో పలు మెడికల్ ఇన్స్టిట్యూట్ ల నుండి బృందాలు వచ్చాయని, నమోదైన కేసుల వివరాలు తెలుసుకొని శాంపిల్స్ సేకరిస్తున్నారు అని పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్వో నుండి ఇద్దరు ప్రతినిధులు కూడా వచ్చారని వారు కూడా ఇక్కడ వివరాలు తెలుసుకుంటున్నారు అని , వ్యాధి లక్షణాలను , రోగుల పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఏలూరులో నీళ్ల శాంపిల్స్, పాల శాంపిల్స్ సేకరించి న్యూఢిల్లీ ఎయిమ్స్ కు పంపనున్నట్లు గా పేర్కొన్నారు.
పూణే వైరాలజీ ఇన్స్టిట్యూట్ నుండి కూడా నిపుణులు
పూణే వైరాలజీ ఇన్స్టిట్యూట్ నుండి నిపుణులు కూడా ఏలూరు అంతుచిక్కని వ్యాధి పై అధ్యయనం చేయనున్నారని మోహన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏలూరు లో బాధితులకు మెరుగైన సేవలు అందుతున్నాయని తెలిపిన ఏ వి ఆర్ మోహన్, డిశ్చార్జ్ అయిన వారు తిరిగి కొందరు అనారోగ్యంతో మరలా వస్తున్న కారణంగా, వారి ఆరోగ్యాన్ని కూడా నిరంతరం పర్యవేక్షిస్తామని, అన్ని ప్రాంతాల్లో 108 వాహనాలు సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు.
పూర్తి నిర్ధారణ లేకుండా నివేదిక ఇవ్వలేం ..స్పష్టం చేసిన డిసిహెచ్ఎస్ మోహన్
పూర్తి నిర్ధారణ లేకుండా నివేదికలు బయటకు వెల్లడించలేదని చెప్పిన డిసిహెచ్ఎస్ మోహన్ ప్రజలు భయాందోళనలతో కూడా అనారోగ్యానికి గురవుతారు ఆసుపత్రుల పాలవుతున్నారు అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఎందువల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది అన్నదానిపై ప్రాథమిక నివేదిక వచ్చిందని, కొత్తగా మరో 40 మంది బాధితులు శాంపిల్స్ ను సేకరించామని వాటిని కూడా పరీక్షల నిమిత్తం పంపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మొత్తం అన్ని పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతనే వ్యాధిని నిర్ధారించే అవకాశం ఉన్నట్లుగా మోహన్ తెలిపారు.