చంద్రబాబుపై ఆ మాజీ ఎంపీ అసంతృప్తి... వైసీపీ వైపు చూపులు, ఆ జిల్లాకు షాక్..!
ఏలూరు: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శతృవులు ఉండరనేది చాలా సార్లు రుజువైంది. ప్రస్తుతం ఉన్న పార్టీలో కాస్త తేడా కొడితే చాలు.. నాయకులు అధికార పార్టీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమైపోతారు. ఇలాంటి ఘటనలు చాలా చూశాం. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏదో ఆశించి అధికారపక్షంలోకి దూకడం తెలుగురాష్ట్రాల రాజకీయాల్లో కొత్తేమీ కాదు. ఇక్కడ కాకపోతే ఇంకో చోట అనే ఫిలాసఫీ మన నాయకులది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ కీలక నేత టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారని జిల్లా రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ నేత ఎవరు..?
టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు కరోనా పాజిటివ్ ... ఏపీలో తాజా కరోనా పరిస్థితి ఇదే
టీడీపీలోయాక్టివ్గా లేని మాగంటి
పశ్చిమ గోదావరి జిల్లా.. 2014లో టీడీపీకి కంచుకోటగా నిలిచిన జిల్లా. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ 15 స్థానాలకు గాను 14 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక ఏలూరు ఎంపీగా మాగంటి బాబు టీడీపీ నుంచి విజయం సాధించారు. అంతకుముందు కాంగ్రెస్లో కొనసాగిన మాగంటి బాబు.. రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఏలూరు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన మాగంటి బాబు ఎప్పుడూ వార్తల్లో నిలిచేవారు. 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ ఫ్యాన్ గాలికి టీడీపీ అడ్రస్ లేకుండా పోయింది. దీంతో ఏలూరు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేసిన మాగంటి బాబు కూడా ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుంచి పెద్దగా యాక్టివ్గా లేరు.
అలకపాన్పు ఎక్కిన మాగంటి బాబు
తాజాగా టీడీపీ జాతీయాధ్యక్షుడు ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పార్టీ పదవులను ప్రకటించారు. అయితే పశ్చిమగోదావరి జిల్లాకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. టీడీపీకి చంద్రబాబుకు ఎంతో సన్నిహితంగా మెలిగిన మాగంటి బాబును పక్కన పెట్టారు. దీంతో మాగంటి బాబు అలకపాన్పు ఎక్కినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాదు చంద్రబాబు కనీసం మాగంటి పేరును పరిగణలోకి కూడా తీసుకోకపోవడంతో ఒక్కింత ఆవేదనకు అసంతృప్తికి గురైనట్లు సమాచారం. రాష్ట్ర స్థాయిలో కాకపోయినప్పటికీ కనీసం జిల్లా స్థాయి పదవి కూడా మాగంటి బాబుకు అప్పగించకపోవడంతో ఆయన మనస్తాపానికి గురైనట్లు సమాచారం.
తనను దూరం పెట్టడంపై అసంతృప్తి
2019 ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓటమిపాలైందని అందులో తనతో పాటు చాలామంది ఓడిపోయారని మరి అలాంటప్పుడు తనను మాత్రమే ఎందుకు పక్కనపెట్టారనే ప్రశ్న మాగంటి బాబును వేధిస్తోందని సమాచారం. పార్టీకి ఎంతో విధేయతతో ఉన్నప్పటికీ తనను దూరం పెట్టాల్సిన అవసరం చంద్రబాబుకు ఏమొచ్చిందంటూ సన్నిహితుల వద్ద మాగంటి బాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక తనను పక్కనపెట్టి ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడిగా గన్ని వీరాంజనేయులును నియమించడంపై మాగంటి బాబు అసంతృప్తితో పాటు అసహనం, ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం..?
చంద్రబాబు, టీడీపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాగంటి బాబు చూపు ఇప్పుడు వైసీపీపై పడినట్లు జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. టీడీపీలో తనకు అవమానం జరిగిందన్న భావనలో ఉన్న మాగంటి బాబు... వైసీపీలో చేరితే బాగుంటుందని భావిస్తున్నారట. అయితే మాగంటి బాబు వైసీపీలో చేరడం అంత సులువు కాదని తెలుస్తోంది. ఎందుకంటే ఆయన రాకను వైసీపీ వర్గాలు వ్యతిరేకించే అవకాశాలున్నాయి. కానీ ఓ పార్టీలో ప్రధాన పాత్ర పోషించి ఆ తర్వాత ఎలాంటి పదవి లేకపోతే ఆ పార్టీలో ఉండటం మంచిది కాదనే డెసిషన్కు మాగంటి వచ్చేశారని సమాచారం. ఈ క్రమంలోనే వైసీపీలో ఎలాంటి పదవి ఇవ్వకపోయినప్పటికీ... ముందుగా ఆ పార్టీలో చేరి టీడీపీకి జలక్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం. అయితే మాగంటి బాబు పార్టీలో చేరితే వైసీపీ నేతలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారో అనేది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. అయితే మాగంటి బాబును వైసీపీలోకి తీసుకొచ్చే నేత ఎవరు..? సీఎం జగన్తో మంత్రాంగం చేసేవారెవరు, మాగంటి టీడీపీని వీడితే పరిస్థితి ఎలా మారుతుందనేదానిపై జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.