పవన్ కల్యాణ్ అభిమానులను తరిమి కొట్టి.. బర్త్ డే కేక్ ను కాలితో తొక్కి: క్షమాపణ చెప్పిన డైరెక్టర్
ఏలూరు: ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిమానులకు ఘోర అవమానం సంభవించింది. తాడేపల్లి గూడెం శశి విద్యాసంస్థల ఎదురుగా వారు పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తుండగా, సంబంధిత విద్యాసంస్థల డైరెక్టర్ నరేంద్ర మేకా వారిని అడ్డుకున్నారు. పవన్ కల్యాణ్ అభిమానులు చెదరగొట్టారు. పోలీసుల సహకారంతో వారిని తరిమి కొట్టారు. అభిమానులు చందాలు వేసి తెచ్చుకున్న 25 కేజీల కేక్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు శశి విద్యాసంస్థల యాజమాన్యానికి వ్యతిరేకంగా రోడ్డు మీద బైఠాయించారు. నినాదాలు చేశారు. దీనితో నరేంద్ర మేకా క్షమాపణలు చెప్పారు. దీనికి దారి తీసిన పరిస్థితులపై ఆయన శశి విద్యాసంస్థల ఫేస్ బుక్ అకౌంట్ లో వివరణ ఇచ్చుకున్నారు.
రేపే వైఎస్ విగ్రహం పున: ప్రతిష్ఠ: టీడీపీ నేతలకు ఆహ్వానం..దానికి కారణం?
25 కేజీల కేక్ నేలపాలు
సోమవారం పవన్ కల్యాణ్ పుట్టినరోజు. శని, ఆది, సోమ మంగళవారాల్లో వరుస సెలవులు రావడంతో శశి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కళాశాల ప్రాంగణంలోని వసతి గృహాల్లో నివసిస్తున్న తమ కుమార్తెలను ఇంటికి తీసుకెళ్లడానికి వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో విద్యాసంస్థ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో అదే విద్యాసంస్థకు చెందిన పలువురు విద్యార్థులు స్థానిక జనసేన పార్టీ నాయకులతో కలిసి శశి కళాశాల ఎదురుగా.. పవన్ కల్యాణ్ పుట్టినరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం వారు 25 కేజీల కేక్ ను తీసుకొచ్చారు. పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని అభిమానులు, కార్యకర్తలు సుమారు వందమందికి పైగా శశి విద్యాసంస్థల ప్రధాన గేటు వద్దకు చేరుకున్నారు. పవన్ కల్యాణ్ జిందాబాద్ అంటూ నినదించారు. అరుపులు, కేకలతో పరిసరాలను మారుమోగించారు.
విద్యార్థులను చెదరగట్టిన డైరెక్టర్..
దీన్ని గమనించిన విద్యాసంస్థల డైరెక్టర్ నరేంద్ర.. సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పవన్ కల్యాణ్ అభిమానులు వెళ్లిపోవాలని సూచించారు. వారు దీనికి నిరాకరించారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ కేక్ ను కట్ చేసి తీరుతామని, ఆ తరువాత వెళ్లిపోతామని కోరారు. దీనికి నరేంద్ర అంగీకరించలేదు. కళాశాల సిబ్బంది సహకారంతో వారిని చెదరగొట్టారు. దీనితో అభిమానులు తాము తెచ్చుకున్న కేక్ ను అక్కడే వదిలేసి, వెళ్లిపోయారు. అభిమానులు బైక్ పై తీసుకొచ్చిన ఈ కేక్ ను నరేంద్ర.. లాగి కిందికి పడేశారు. కాలితో తొక్కారు. అదే సమయంలో విద్యాసంస్థల యాజమాన్యం పోలీసులను కూడా పిలుచుకుని రావడంతో గొడవ మరింత ముదిరింది. కేక్ కట్ చేయడానికి అనుమతి లేదని పోలీసులు అభ్యంతరంవ్యక్తం చేశారు. అనుమతి లేకున్నా ఎలా కట్ చేస్తారంటూ నిలదీశారు. తమతో వాదించిన కొంతమంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
అండగా జనసేన నేతలు..
ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు విద్యార్థులకు అండగా నిలిచారు. విద్యాసంస్థ వద్ద నుంచి పోలీస్ స్టేషన్వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్ట్ చేసిన విద్యార్ధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. వందమందికి పైగా విద్యార్థులు, జనసేన పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
విద్యార్థుల రూపంలో బయటి వ్యక్తులు..
ఈ ఘటన తీవ్రరూపం దాల్చడంతో శశి విద్యాసంస్థల యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. డైరెక్టర్ నరేంద్ర.. తాను పవన్ కల్యాణ్ కు వ్యతిరేకిని కాదని వివరణ ఇచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు భావాలకు ాను విరోధిని కాదని అన్నారు. ఆయన జన్మదిన వేడుకలలో విద్యార్ధులే కాకుండా బయట వారు వచ్చారని, వారిని నివారించడానికే తాను అలా ప్రవర్తించాల్సి వచ్చిందని చెప్పారు. వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ఇచ్చినందు వల్ల హాస్టల్ లో ఉంటోన్న తమ కుమార్తెలను ఇంటికి తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు వచ్చారని, అలాంటి సమయంలో బయటి వ్యక్తులు క్యాంపస్ వద్ద హడావుడి చేయడం వల్ల కళాశాల కి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. ఆ భావన తో నేను కొంత అత్యుత్సాహం ప్రదర్శించానని పేర్కొన్నారు. చేసిన పనికి తాను పశ్చాత్తాప పడుతున్నానని అన్నారు.