నర్సాపురం లోక్ సభ బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి!
ఏలూరు: భారతీయ జనతాపార్టీ అధిష్ఠానం లోక్ సభ అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించడానికి ముందే- అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లోక్ సభ అభ్యర్థిగా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు అభ్యర్థిత్వాన్ని పార్టీ నాయకత్వం ఖరారు చేసింది.
జగన్ జాతకం ఈడి దగ్గర ఉంది : జెడి పదేళ్ల క్రితమే బిగించేసారు: పవన్ నామినేషన్ దాఖలు
ఈ నేపథ్యంలో- శుక్రవారం ఉదయం ఆయన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. సొంత పట్టణం తాడేపల్లిగూడెం నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్తారని బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు తెలిపారు. తాడేపల్లిగూడెంలో ఉదయం 10 గంటలకు ర్యాలీ ఆరంభం కానుంది.
అనంతరం- పిప్పర, అత్తిలి, పెనుమంట్ర, మార్టేరు, పాలకొల్లు మీదుగా నర్సాపురం చేరుకుంటుంది. మాణిక్యాల రావు అక్కడే రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేస్తారు. మిగిలిన లోక్ సభ స్థానాల అభ్యర్థుల పేర్లు గురువారం రాత్రికి వెల్లడి కానున్నాయి.
సౌమ్యుడిగా పేరు
పైడికొండల మాణిక్యాల రావు 2014 ఎన్నికల్లో తాడేపల్లి గూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తెలుగుదేశం పార్టీతో కుదుర్చుకున్న పొత్తు కారణంగా.. ఆయనకు చంద్రబాబు కేబినెట్ లో బెర్తు లభించింది. దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి టీడీపీ బయటికి వచ్చిన తరువాత.. మాణిక్యాల రావు తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు కామినేని శ్రీనివాస్ కూడా మంత్రివర్గం నుంచి బయటికి వచ్చిన విషయం తెలిసిందే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం ప్రస్తుతం బీజేపీ ఆధీనంలోనే ఉంది. 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన గోకరాజు రంగరాజు సుమారు 80 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. వివాదరహితునిగా పేరున్న మాణిక్యాల రావును అసెంబ్లీ బరిలో కాకుండా లోక్ సభ నిలబెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా అదేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.