పశ్చిమను వీడని వింతవ్యాధి- ఏలూరు నుంచి భీమడోలుకు- చోద్యం చూస్తున్న సర్కారు
గతంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరును కుదిపేసిన వింతవ్యాధి కారణంగా దాదాపు 700 మంది ఆస్పత్రుల పాలయ్యారు. సర్కారు అప్పటికప్పుడు స్పందించి నష్టనివారణ చర్యలు చేపట్టడంతో ఎక్కువగా ప్రాణనష్టం లేకుండా పోయింది. దీనిపై ప్రభుత్వం పలు కమిటీలు నియమించి, నివేదికలు తెప్పించుకుని చర్యలు చేపట్టినట్లు ప్రకటించుకుంది. కానీ ఈ ఘటన జరిగి రెండు నెలలు కూడా గడవకముందే తిరిగి పశ్చిమగోదావరి జిల్లా భీమడోలును ఈ వింతవ్యాధి కుదిపేస్తోంది. ఇప్పటికే వింతవ్యాధి కారణంగా ఆస్పత్రుల్లో చేరిన వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఏలూరు వింతవ్యాధికి అసలు కారణమిదే- తేల్చిన హై పవర్ కమిటీ- ఇదే ఫైనల్
పశ్చిమలో మళ్లీ వింతవ్యాధి
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరును గతంలో కుదిపేసిన వింతవ్యాధి ఇప్పుడు సమీపంలో ఉన్న భీమడోలుకు పాకింది. ఏలూరుకు సమీపంలో ఉన్న భీమడోలులో వింతవ్యాధి కారణంగా మూర్చపోతున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో వింతవ్యాధి బాధితుల శాంపిల్స్ను ల్యాబ్స్కు పంపినట్లుగానే.. ఈసారి కూడా వైద్యఆరోగ్యశాఖ రక్త, మూత్ర నమూనాలు సేకరించి పరీక్షా కేంద్రాలకు పంపుతోంది. వీటి ఫలితాలు వస్తే కానీ ఏమీ చెప్పలేని పరిస్ధితి నెలకొంది. అయితే వీరిలో ఇప్పటివరకూ ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడం ఒక్కటే ఊరటగా కనిపిస్తోంది.
పూళ్ల గ్రామంలోనే బాధితులు
జిల్లాలోని భీమడోలు మండలంలో ఉన్న పూళ్ల గ్రామం నుంచి ఇప్పటివరకూ 15 మంది బాధితులు వింతవ్యాధి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. వీరందరినీ భీమడోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గతంలో ఏలూరులో బాధితుల తరహాలోనే వీరు కూడా మూర్చపోవడం, విచిత్రంగా ప్రవర్తించడం, శ్వాసలో ఇబ్బందులు వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిలో పలువురు పీహెచ్సీకి తీసుకొచ్చేసరికి అపస్మారక స్ధితిలో ఉన్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. ఐదుగురు ఫిట్స్తో వచ్చారని, మిగిలిన వారు అపస్మారక స్ధితిలో ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.
బాధితులకు ఆళ్లనాని పరామర్శ
వింతవ్యాధితో ఆస్పత్రిలో చేరిన బాధితులను ఇవాళ వైద్యఆరోగ్యమంత్రి ఆళ్లనానితోపాటు జిల్లా కలెక్టర్ పరామర్శించారు. వింతవ్యాధికి గల కారణాలను డాక్టర్లతో ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాధితుల శాంపిల్స్ను ఏలూరు తరహాలోనే పరీక్షలకు పంపాలని ఆదేశాలు ఇచ్చారు. నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్యమంత్రి తెలిపారు. పూళ్లలో ఇలాగే వింతవ్యాధి బారిన పడిన మిగతావారిపైనా దృష్టిసారించాలని కలెక్టర్కు సూచించారు.
నియంత్రణలో చోద్యం చూస్తున్న సర్కారు
గతంలో ఏలూరులో వింతవ్యాధి బయటపడిన నేపథ్యంలో ప్రభుత్వం పలు కమిటీలను వేసింది. వాటి నివేదికలు కూడా వచ్చాయి. ఇందులో ప్రధానమైన హై పవర్ కమిటీలో నిపుణులు భారీగా సూచనలు కూడా చేశారు. వాటిని జిల్లాలో అమలు చేయడంలో మాత్రం ప్రభుత్వం విఫలమైంది. దీంతో జిల్లాలోనే మరోసారి వింతవ్యాధి కలకలం రేపుతోంది. దీంతో భీమడోలు పరిసర ప్రాంతాల్లో ప్రజలు నీరు తాగాలన్నా, కూరగాయలు కొనాలన్నా భయపడే పరిస్ధితి. ప్రభుత్వం ఈసారి కూడా ల్యాబ్ల నివేదికపైనే ఆధారపడాల్సిన పరిస్దితి. గతంలో హైపవర్ కమిటీ సూచనలు అమలు చేసుంటే నెల రోజుల వ్యవధిలో మరోసారి వ్యాధి రిపీట్ అయ్యేది కాదనే వాదన కూడా వినిపిస్తోంది.