కుమార్తెను వేధిస్తోన్న ఆటోడ్రైవర్ను ఉతికి ఆరేసిన తల్లి: అర్ధనగ్నంగా: దిశ చట్టం కింద కేసు నమోదు
ఏలూరు: మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే మూడు వారాల్లోనే ఉరికంబాన్ని ఎక్కించే దిశ చట్టం ఉన్నప్పటికీ.. పోకిరిరాయుళ్లలో ఎలాంటి మార్పూ రాలేదనడానికి తాజా ఉదాహరణ ఈ ఘటన. పదవ తరగతి చదువుతోన్న ఓ విద్యార్థినిని ప్రేమ పేరుతో తరచూ వేధింపులకు గురి చేస్తోన్న ఆటోడ్రైవర్కు ఆమె తల్లి బడితెపూజ చేసిన ఉదంతం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకోడూరు మండలంలో చోటు చేసుకుంది.
కులాన్ని కులంతోనే ఢీ: జగన్ సర్కార్లోకి రిటైర్డ్ సీఎస్ రమాకాంత్ రెడ్డి ఎంట్రీ?
పాలకోడూరు మండలంలోని విస్సా కోడూరుకు చెందిన ఓ విద్యార్థిని స్థానికంగా పదవ తరగతి చదువుతోంది. పేరుపాలెం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ ఆ విద్యార్థినపై కన్నేశాడు. ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. కొద్దిరోజుల పాటు మౌనంగా అతడి వేధింపులను భరించిందా విద్యార్థిని. తన స్నేహితులతో చెప్పుకొన్నప్పటికీ పెద్దగా ఫలితం లేకపోవడంతో అతని ఆగడాలపై పెదవి విప్పలేదు. దీనితో అతను మరింత రెచ్చిపోసాగాడు.
అతని వేధింపులు మరింత తీవ్రతరం అయ్యాయి. తన ఆటోలనే స్కూలుకు రాకపోకలు సాగించాలని, తాను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి రావాలంటూ వెంటపడసాగాడు. దీనితో అతని వేధింపులను తట్టుకోలేక ఆ విద్యార్థిని ఈ విషయాన్ని తన తల్లికి వివరించింది. అంతే- అపర కాళికలా మారిందామె. తన కుమార్తెను వేధిస్తోన్న ఆటోడ్రైవర్ను ఎక్కడ ఉన్నాడో వెతికి మరీ పట్టుకుంది. ఉతికి ఆరేసింది. చెప్పులు, చీపుర్లే ఆమె ఆయుధాలయ్యాయి. ఆటోడ్రైవర్ను అర్ధనగ్నంగా మార్చివేసి మరీ దేహశుద్ధి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తన పిల్లల జోలికి వస్తే.. ఏ తల్లయినా ఇలాగే ప్రవర్తిస్తుందని ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. దిశ వంటి చట్టాలను తీసుకుని వచ్చినప్పటికీ పోకిరి రాయుళ్ల మనస్తత్వం మారలేదని విమర్శిస్తున్నారు. అమ్మాయిలు తమకు వేధింపులు ఎదురైతే కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని, అప్పుడే సత్ఫలితాలు ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు. దిశ చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.